డోంగ్హే (దక్షిణ కొరియా): ఆసియా మహిళల హాకీ చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు ఘనంగా బోణీ కొట్టింది. దక్షిణ కొరియా వేదికగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 13-0తో థాయిలాండ్ను చిత్తుగా ఓడించింది. డ్రాగ్ ఫ్లికర్ గుర్జిత్ కౌర్ ఐదు గోల్స్ (2, 14, 24, 25, 58వ నిమిషాల్లో)తో విజృంభించగా.. లిలిమా మింజ్, జ్యోతి చెరో రెండు గోల్స్ కొట్టారు. మౌనిక, వందన కఠారియా, రజ్విందర్ కౌర్, సోనిక ఒక్కో గోల్తో విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. టోక్యో ఒలింపిక్స్లో అద్భుత ప్రదర్శనతో నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో పతకాన్ని కోల్పోయిన మన అమ్మాయిలు.. ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో పతకమే లక్ష్యంగా బరిలోకి దిగిన తొలి మ్యాచ్లోనే విశ్వరూపం కనబర్చారు. మ్యాచ్ ఆరంభం నుంచి సవిత బృందం మైదానంలో సింహగర్జన చేస్తే.. ప్రత్యర్థి జట్టు కనీసం ఒక్క గోల్ కూడా నమోదు చేయకుండానే ఓటమి పాలైంది. రెండో మ్యాచ్లో సోమవారం మలేషియాతో భారత్ తలపడనుంది.