ఐపీఎల్-17లో పంజాబ్- హైదరాబాద్ మధ్య ముగిసిన ఉత్కంఠ మ్యాచ్ను మరిచిపోకముందే మరో ఆసక్తికకర పోరు అభిమానులను అలరించింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న రాజస్తాన్ రాయల్స్ జోరుకు గుజరాత్ టైటాన్స్ కళ్లెం వేసింది. ఆఖరి బంతికి ఫలితం తేలిన ఈ మ్యాచ్లో రాయల్స్కు ఓటమి రుచి చూపించింది. బౌలింగ్లో విఫలమైనా బ్యాటింగ్లో గుజరాత్ సమిష్టిగా ఆడి విక్టరీ కొట్టింది. ఛేదనలో గుజరాత్కు గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా ఆఖర్లో రాహుల్ తెవాటియా, రషీద్ఖాన్ మెరుపులతో రాజస్తాన్కు ఓటమి తప్పలేదు.
IPL | జైపూర్: ఐపీఎల్-17లో వరుసగా నాలుగు మ్యాచ్లు గెలిచిన రాజస్తాన్ రాయల్స్కు గుజరాత్ తొలి షాక్ ఇచ్చింది. జైపూర్లోని సవాయ్మాన్సింగ్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో 3 వికెట్ల తేడాతో రాయల్స్ను ఓడించింది. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన రాజస్తాన్.. రియాన్ పరాగ్ (48 బంతుల్లో 76, 3 ఫోర్లు, 5 సిక్సర్లు), కెప్టెన్ సంజూ శాంసన్ (38 బంతుల్లో 68 నాటౌట్, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) సమయోచిత ఇన్నింగ్స్లతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో గుజరాత్.. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఆ జట్టు సారథి శుభ్మన్ గిల్ (44 బంతుల్లో 72, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీతో పోరాడగా సాయి సుదర్శన్ (29 బంతుల్లో 35, 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. ఆఖర్లో రాహుల్ తెవాటియా (11 బంతుల్లో 22, 3 ఫోర్లు), రషీద్ ఖాన్ (11 బంతుల్లో 24 నాటౌట్, 4 ఫోర్లు) లు అద్వితీయ పోరాడటంతో గుజరాత్ గెలుపుబాట పట్టింది. రషీద్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
రాజస్తాన్ ఇన్నింగ్స్ నెమ్మదిగానే మొదలైంది. ఈ సీజన్లో వరుసగా విఫలమవుతున్న యశస్వీ జైస్వాల్ (19 బంతుల్లో 24, 5 ఫోర్లు) టచ్లోకి వచ్చినట్టే కనిపించినా ఉమేశ్ యాదవ్ బౌలింగ్లో వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ సూపర్ క్యాచ్ పట్టడంతో వెనుదిరిగాడు. ఆర్సీబీతో గత మ్యాచ్లో సెంచరీ చేసిన బట్లర్ (8) మరోసారి రషీద్ స్పిన్ మాయాజాలానికి తలవంచక తప్పలేదు. ఓపెనర్లు నిష్క్రమించాక వచ్చిన శాంసన్, రియాన్ పరాగ్.. క్రీజులో కుదురుకునేదాకా బంతికోపరుగు అన్నట్టుగానే ఆడారు. కానీ 12వ ఓవర్ నుంచి ఇద్దరూ గేర్ మార్చారు. నూర్ అహ్మద్ వేసిన ఆ ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన పరాగ్.. మోహిత్ శర్మ వేసిన తర్వాతి ఓవర్లో మరో సిక్సర్ కొట్టి 34 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. 15వ ఓవర్లో శాంసన్.. స్పెన్సర్ జాన్సన్ను లక్ష్యంగా చేసుకుని రెండు ఫోర్లు, సిక్సర్తో స్కోరుబోర్డు వేగాన్ని పెంచాడు. మోహిత్ వేసిన 17వ ఓవర్లో ఆఖరి బంతికి లాంగాన్ దిశగా బౌండరీతో అతడూ ఈ సీజన్లో మూడో అర్ధ శతకం పూర్తిచేసుకున్నాడు. 78 బంతుల్లో 130 పరుగులు జోడించిన ఈ జోడీని మోహిత్ శర్మ విడదీశాడు. 8 ఓవర్లకు 52/2గా ఉన్న రాజస్తాన్ స్కోరు 20 ఓవర్లకు 196/3గా ముగిసిందంటే అది ఈ ఇద్దరి చలవే.
భారీ ఛేదనలో గుజరాత్కు శుభారంభమే దక్కినా ఓపెనర్లు ధాటిగా ఆడలేకపోయారు. రాజస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ స్కోరు వేగం పుంజుకోలేదు. 8.2 ఓవర్లలో 64 పరుగులు జోడించిన ఈ జోడీని కుల్దీప్ సేన్ విడదీశాడు. 2 ఓవర్ల వ్యవధిలో అతడు మూడు కీలక వికెట్లు పడగొట్టి గుజరాత్ను ఒత్తిడిలోకి నెట్టాడు. సాయి సుదర్శన్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న కుల్దీప్.. వేడ్, అభినవ్ను ఒకే ఓవర్లో క్లీన్బౌల్డ్ చేశాడు. విజయ్ శంకర్ (16)ను చాహల్ బలిగొన్నాడు. క్రీజులోకి వచ్చినోళ్లు వచ్చినట్టే సహచర ఆటగాళ్లు వెనుదిరుగుతున్నా పట్టుదలతో ఆడిన గిల్ 35 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేశాడు. ఆఖరి 5 ఓవర్లలో ఆ జట్టు విజయానికి 73 పరుగులు అవసరం కాగా.. చాహల్.. గిల్ను బోల్తా కొట్టించాడు. షారుక్ ఖాన్ (14)ను అవేశ్ ఖాన్ ఎల్బీగా వెనక్కిపంపాడు. కానీ తెవాటియా, రషీద్ ఆఖర్లో అద్భుతంగా పోరాడారు. కుల్దీప్ 19వ ఓవర్లో ఈ ఇద్దరూ 20 పరుగులు రాబట్టారు. చివరి ఆరు బంతుల్లో గుజరాత్ విజయానికి 15 పరుగులు అవసరం కాగా గత రెండు మ్యాచ్లలో రాజస్తాన్ను గెలిపించిన అవేశ్ ఖాన్.. ఈసారి విఫలమయ్యాడు. రషీద్ ఖాన్ బౌండరీలతో విరుచుకుపడి రాయల్స్కు షాకిచ్చాడు.
రాజస్తాన్ : 20 ఓవర్లలో 196/3 (పరాగ్ 76, శాంసన్ 68 నాటౌట్, రషీద్ 1/18, ఉమేశ్ 1/47).
గుజరాత్ : 20 ఓవర్లలో 199/7 (గిల్ 72, సాయి 35, కుల్దీప్ 3/41 , చాహల్ 2/43)