IPL 2024 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్(IPL 2024)కు ముందు మాజీ చాంపియన్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)కు భారీ షాక్ తగిలింది. మినీ వేలంలో రూ.3.6 కోట్లు కొల్లగొట్టిన యువ బ్యాటర్ రాబిన్ మింజ్(Robin Minz) ఆదివారం యాక్సిడెంట్కు గురయ్యాడు. ‘జార్ఖండ్ క్రిస్ గేల్’, ‘ధోనీ వారసుడి’గా పేరొందిన రాబిన్ నడుపుతున్న కవాసకీ సూపర్ బైక్(Kawasaki Super Bike) ప్రమాదానికి గురైంది. అయితే.. ఈ సంఘటనలోరాబిన్కు స్వల్ప గాయాలు అయ్యాయని, ప్రస్తుతం అతడు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని అతడి తండ్రి ఫ్రాన్సిన్ మింజ్ తెలిపాడు.
‘శనివారం ట్రైనింగ్ ముగించుకొని ఇంటికి వస్తుండగా రాబిన్ బైక్ స్కిడ్ అయింది. ముందు ఒక బండి ఉండడంతో రాబిన్ తన బైక్ను నియంత్రించలేక కింద పడిపోయాడు. దాంతో, అతడికి చిన్నపాటి గాయాలయ్యాయి. ప్రస్తుతానికి అతడి అరోగ్యాన్ని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు’ అని ఫ్రాన్సిస్ వెల్లడించాడు. ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ఇంకా రెండు వారాల పైనే ఉంది. ఆలోపు రాబిన్ కోలుకోవాలని గుజరాత్ అభిమానులు కోరుకుంటున్నారు.
రాబిన్ తండ్రి ఫ్రాన్సిస్తో శుభ్మన్ గిల్
రాబిన్ది జార్ఖండ్లోని గుల్మా జిల్లా. అతడి ప్రతిభను గమనించిన ముంబై ఇండియన్స్ ప్రత్యేకంగా లండన్లో శిక్షణ ఇప్పించింది. ప్రస్తుతం రాబిన్ కుటుంబం రాంచీలో ఉంటోంది. ఆర్మీ రిటైర్డ్ ఆఫీసర్ అయిన అతడి తండ్రి ఫ్రాన్సిన్ మించ్ రాంచీ విమానాశ్రయం(Ranchi Airport)లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. ఈమధ్యే గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్.. ఫ్రాన్సిస్ను కలిసి ఫొటో కూడా దిగాడు.
నిరుడు దుబాయ్లో జరిగిన మినీ వేలంలో రాబిన్ ఊహించని విధంగా భారీ ధర పలికాడు. ఈ లెఫ్ట్ హ్యాండర్ను గుజరాత్ రూ.3.6 కోట్లకు కొన్నది. కానీ, సరిగ్గా టోర్నీ ప్రారంభానికి 19 రోజుల ముందే రాబిన్ యాక్సిడెంట్కు గురి అయ్యాడు. మార్చి 22వ తేదీన ఐపీఎల్ 17వ సీజన్ షురూ కానుంది. గుజరాత్ తమ తొలి పోరులో భాగంగా మార్చి 24న ముంబై ఇండియన్స్ను ఢీ కొట్టనుంది.