WPL 2023 | మహిళల క్రికెట్లో సరికొత్త అధ్యాయానికి నేడు తెరలేవనుంది. అంతర్జాతీయ క్రికెట్లో కొత్త ఒరవడి సృష్టించిన ఐపీఎల్ తరహాలో.. రూపొందించిన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)కు నేడు అంకురార్పణ జరుగనుంది. ఐదు జట్లు తలపడనున్న ఈ లీగ్ తొలి సీజన్కు ముంబై వేదిక కానుండగా.. ప్రారంభం పోరులో గుజరాత్ జెయింట్స్తో ముంబై ఇండియన్స్ అమీతుమీ తేల్చుకోనుంది. మరింకెందుకు ఆలస్యం.. ఐపీఎల్కు ముందే వచ్చిన మరో పరుగుల పండుగను ఆస్వాదించేందుకు మీరూ సిద్ధమైపోండి!
ముంబై: మహిళల క్రికెట్ రూపురేఖలు మార్చగలిగే సత్తాఉన్న.. మెగా లీగ్కు రంగం సిద్ధమైంది. ఎంతోకాలంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి సీజన్కు శనివారం తెరలేవనుంది. తొలి మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్తో ముంబై ఇండియన్స్ తలపడనుండగా.. ఈ నెల 26 ఫైనల్ జరుగనుంది. మొత్తం ఐదు జట్లు పాల్గొంటున్న ఈ లీగ్లో 21 మ్యాచ్లు నిర్వహించనున్నారు. గత కొంతకాలంగా అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న మన అమ్మాయిలకు ఇది మరో చక్కటి అవకాశం కానుంది. ఉత్కంఠభరిత మ్యాచ్ల్లో సత్తాచాటలేక మెగాటోర్నీల్లో విఫలమవుతున్న భారత ప్లేయర్లకు ఈ లీగ్ ఎంతగానో ఉపకరించనుంది. అంతర్జాతీయ ప్లేయర్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడంతో పాటు.. హోరాహోరీ పోరాటాలతో మనవాళ్లు మరింత రాటుదేలడం ఖాయమే! తొలి సీజన్లో భాగంగా అన్నీ మ్యాచ్లు ముంబైలోనే నిర్వహించనున్నారు. మ్యాచ్లన్నీ రాత్రి 7.30 నుంచి ప్రారంభం కానుండగా.. శనివారం సాయంత్రం 5.30 నుంచే ఆరంభ వేడుకలు జరుగుతాయి. డీవై పాటిల్ స్టేడియంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పలువురు సినీతారలు పాల్గొననున్నారు. లీగ్ ఆరంభానికి ముందే.. ఫ్రాంచైజీల కొనుగోలుతో వార్తల్లోకెక్కిన డబ్ల్యూపీఎల్.. ఆటలోనూ సంచలనాలు నమోదు చేసేందుకు సిద్ధమైంది.
లీగ్ ఆరంభ మ్యాచ్లో బెత్ మూనీ సారథ్యంలోని గుజరాత్ జెయింట్స్తో హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ జట్టు తలపడనుంది. ముంబై టీమ్లో హర్మన్తో పాటు యస్తికా భాటియా, పూజ లాంటి టీమ్ఇండియా ప్లేయర్లతో పాటు.. అమేలీ కెర్, హీలీ మాథ్యూస్, నటాలియా స్కీవర్, హీథర్ గ్రహమ్ వంటి అంతర్జాతీయ స్టార్లు ఉన్నారు. ఇటీవల మహిళల టీ20 ప్రపంచకప్లో దుమ్మురేపిన ఆసీస్ ప్లేయర్ బెత్ మూనీ గుజరాత్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నది. ఆమెతో పాటు స్నేహ్ రాణా, హర్లీన్ డియోల్, ఆష్లే గార్డ్నర్ కీలకం కానున్నారు. గుజరాత్ జట్టులో సబ్బినేని మేఘన, షబ్నమ్ రూపంలో ఇద్దరు తెలుగమ్మాయిలు ఉన్నారు.
మహిళల కోసం ప్రత్యేకంగా లీగ్ నిర్వహించడం ఆనందంగా ఉంది. దేశంలోనే కాక ఇతర దేశాల ప్లేయర్లకు కూడా డబ్ల్యూపీఎల్ చక్కటి వేదిక. ఇలాంటి లీగ్లో భాగస్వామి కావడం సంతోషం. మహిళల క్రికెట్లో ఇది పెను మార్పులు తీసుకురావడం ఖాయమే.
– మిథాలీరాజ్