ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. లీగ్లో ఇప్పటికే ప్లేఆఫ్స్ అవకాశాలను కోల్పోయిన ముంబై..టేబుల్ టాపర్ గుజరాత్టైటాన్స్కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. గెలిచి ప్లేఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకోవాలనుకున్న టైటాన్స్ ఆశలను అడ్డుకుంది. ఇషాన్ కిషన్, టిమ్ డేవిడ్, రోహిత్శర్మ రాణింపుతో తొలుత పోరాడే స్కోరు అందుకున్న ముంబై ..బౌలింగ్లో సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఛేదనలో ఓపెనర్లు సాహా, గిల్ అర్ధసెంచరీలతో గుజరాత్కు మెరుగైన శుభారంభమిచ్చినా.. గెలుపు వాకిట బొక్కాబోర్లా పడింది. గత మ్యాచ్ల్లో ఆఖరి క్షణాల్లో విజయాల పరంపరను కొనసాగించలేక ముంబైకి మ్యాచ్ను సమర్పించుకుని ఓటమి వైపు నిలిచింది.
ముంబై: లీగ్లో మరో మ్యాచ్ అభిమానులను కట్టిపడేసింది. గెలుపు కోసం ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య పోరు అభిమానులను అలరించింది. శుక్రవారం ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో ముంబై ఐదు పరుగుల తేడాతో గుజరాత్పై అద్భుత విజయం సాధించింది. దీంతో రెండో గెలుపును ఖాతాలో వేసుకున్న ముంబై నాలుగు పాయింట్లతో పదో స్థానంలో కొనసాగుతుంటే..గుజరాత్ 16 పాయింట్లతో టాప్లో ఉంది. తొలుత ఇషాన్ కిషన్ (29 బంతుల్లో 45, 5ఫోర్లు, సిక్స్), టిమ్ డేవిడ్(21 బంతుల్లో 44 నాటౌట్, 2 ఫోర్లు, 4 సిక్స్లు), రోహిత్శర్మ(28 బంతుల్లో 43, 5 ఫోర్లు, 2 సిక్స్లు) రాణింపుతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 177/6 స్కోరు చేసింది.
గత మ్యాచ్లకు భిన్నంగా ఓపెనర్లు కిషన్, రోహిత్ ముంబైకి మెరుగైన శుభారంభం అందించారు. గుజరాత్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరుబోర్డుకు పరుగులు జోడించారు. ముఖ్యంగా లీగ్లో టచ్ లేకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న హిట్మ్యాన్ ఆకట్టుకున్నాడు. ఇన్నింగ్స్ జోరందుకుంటున్న తరుణంలో రషీద్ఖాన్ బౌలింగ్లో రోహిత్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో తొలి వికెట్కు 74 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్(13), పొలార్డ్(4)విఫలమవగా, హైదరాబాదీ బ్యాటర్ తిలక్వర్మ(21) బ్యాటు ఝులిపించాడు.
ఆఖర్లో టిమ్ డేవిడ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రెండు ఫోర్లు, నాలుగు భారీ సిక్స్లతో ముంబైకి గౌరవప్రదమైన స్కోరు కట్టబెట్టాడు. రషీద్ఖాన్(2/24) రెండు వికెట్లు తీయగా, జోసెఫ్, ఫెర్గుసన్, సాంగ్వాన్ ఒక్కో వికెట్ తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన టైటాన్స్ 20 ఓవర్లలో 172/5 స్కోరుకు పరిమితమైంది. ఓపెనర్లు సాహా, గిల్ జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరు ముంబై బౌలింగ్ను అలవోకగా ఎదుర్కొంటూ బ్యాటింగ్ కొనసాగించారు. దీంతో ఇన్నింగ్స్ 13వ ఓవర్ వరకు ముంబైకి వికెట్ దక్కలేదు. వీరిద్దరి జోరుతో టైటాన్స్ గెలుపు నల్లేరుపై నడకే అనుకున్నారు. కానీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోవడం టైటాన్స్ కొంపముంచింది.
కెప్టెన్ హార్దిక్ పాండ్యా(24), రాహుల్ తెవాటియా(3) రనౌట్ కావడం మ్యాచ్ను మలుపు తిప్పింది. ఆఖరి ఓవర్లో విజయానికి టైటాన్స్ విజయానికి తొమ్మిది పరుగులు అవసరమైన దశలో తెవాటియా వికెట్ కోల్పోయి మూడు పరుగులకే పరిమితమైంది. డానియల్ సామ్స్ ముంబైకి అద్భుత విజయాన్ని కట్టబెట్టాడు. ధనాధన్ ఇన్నింగ్స్తో రాణించిన డేవిడ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. శనివారం లీగ్లో పంజాబ్తో రాజస్థాన్, లక్నోతో కోల్కతా ఆడుతుంది.
ముంబై: 20 ఓవర్లలో 177/6 (ఇషాన్ కిషన్ 45, డేవిడ్ 44 నాటౌట్, రషీద్ఖాన్ 2/24, సాంగ్వాన్ 1/23), గుజరాత్: 20 ఓవర్లలో 172/5(సాహా 55, గిల్ 52, అశ్విన్ 2/29, పొలార్డ్ 1/13)