Greg Chappell : భారత్లో జరగనున్న బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా గెలుస్తుందని ఆ దేశ మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ ఛాపెల్ అన్నాడు. అందుకు కారణం ఏంటనేది కూడా చెప్పుకొచ్చాడు. ‘భారత జట్టు టెస్టుల్లో విరాట్ కోహ్లీపై ఎక్కువగా ఆధారపడుతోంది. స్వదేశంలో భారత్ గతంలో కంటే ఇప్పుడు బలహీనంగా కనిపిస్తోంది. ఎందుకంటే.. ఆ జట్టు కీలక ఆటగాళ్లు రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గాయ పడ్డారు. అందుకని ఈసారి ఆసీస్ సిరీస్ సొంతం చేసుకుంటుంది’ అని చాఫెల్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. చాఫెల్ 2005-07 మధ్య కాలంలో భారత జట్టుకు ప్రధాన కోచ్గా పనిచేశాడు.
2004 నుంచి గెలవలేదు
ఆస్ట్రేలియా జట్టు భారత గడ్డపై సిరీస్ గెలిచి దాదాపు 19 ఏళ్లు కావొస్తోంది. 2004లో ఆ జట్టు ఇండియాలో సిరీస్ విజేతగా నిలిచింది. అయితే.. 2015, 2017, 2020లో భారత్, ఆసీస్ను ఓడించి సిరీస్ నెగ్గింది. అయితే.. ఆ జట్టుపై ఘనమైన రికార్డు ఉన్న రిషభ్ పంత్ గాయం కారణంగా ఈ సిరీస్కు అందుబాటులో లేడు. శ్రేయాస్ అయ్యర్ కూడా వెన్నెముక గాయంతో తొలి టెస్టుకు దూరం అయ్యాడు. దాంతో, కోహ్లీ, రోహిత్ శర్మ, పూజారా, శుభ్మన్ గిల్ ఆసీస్ బౌలర్లపై ఎదురుదాడి చేయాలి. అప్పుడే పర్యాటక జట్టును ఒత్తిడిలో పడేయొచ్చు. ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా నాలుగు టెస్టులు ఆడనుంది. ఇరుజట్ల మధ్య మొదటి టెస్టు ఫిబ్రవరి 9న నాగ్పూర్లో మొదలవుతుంది.