హైదరాబాద్, ఆట ప్రతినిధి: సీఎం కప్ రాష్ట్ర స్థాయి పోటీలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. మండల, జిల్లా స్థాయి పోటీలు విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో ఈ నెల 28 నుంచి 31 వరకు రాష్ట్ర స్థాయి క్రీడా టోర్నీ నిర్వహణకు ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నది. ఈ నేపథ్యంలో గురువారం క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ హైదరాబాద్లో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మొత్తం 18 క్రీడాంశాల్లో దాదాపు 9వేల మంది ప్లేయర్లు, కోచ్లు, అధికారులు నగరానికి రానున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపజేసేలా పోటీల నిర్వహణ ఉండాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సీఎం కప్ దేశానికే తలమానికంగా నిలువాలి. రాష్ట్ర స్థాయి పోటీల కోసం క్రీడా మైదానాలను ఆకట్టుకునే రీతిలో తీర్చిదిద్దాలి. ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఖేల్త్న్ర, అర్జున, ద్రోణాచార్య అవార్డు గ్రహీతలను ఘనంగా సన్మానిస్తాం. సాంస్కృతిక కార్యక్రమాలు ఎమ్మెల్యే బాలకిషన్ ఆధ్వర్యంలో జరుగుతాయి. సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ దీపికారెడ్డి, స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అలరిస్తారు’ అని అన్నారు. సమీక్షా అనంతరం మంత్రి సీఎం కప్ జెర్సీలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.
అందరికీ కృతజ్ఞతలు: సాట్స్ చైర్మన్
మండల, జిల్లా స్థాయిలో క్రీడా పోటీలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా సాట్స్ తరఫున ఆంజనేయగౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభ కల్గిన ప్లేయర్లను వెలికితీసేందుకు సీఎం కప్ పోటీలు దోహదపడుతాయని ఆయన అన్నారు. ఇదే ఉత్సాహంతో రాష్ట్ర స్థాయి పోటీలను మరింత విజయవంతం చేయాలని ఆయన కోరారు.