Goutam Gambhir : రెండో టీ20లో భారత ఆటగాళ్లు స్పిన్నర్లను ఎదుర్కొన్న తీరు చూసి తాను చాలా ఆశ్చర్యపోయానని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ అన్నాడు. భారత ఆటగాళ్లు మ్యాచ్ను చివరి ఓవర్ దాకా తీసుకెళ్లాల్సింది కాదని అతను తెలిపాడు. ముఖ్యంగా ఓపెనర్లు శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో మెరుగుపడాలని ఈ మాజీ క్రికెటర్ సూచించాడు.
స్పిన్ ఉచ్చులో ఇషాన్
‘ఓపెనర్ ఇషాన్ కిషన్ స్పిన్ ఉచ్చులో పడుతున్నాడు. తొలి రెండు టీ20ల్లో అతను స్పిన్నర్లకు వికెట్ సమర్పించుకున్నాడు. అందుకని స్పిన్ బౌలర్లను ఎదుర్కోవడంలో మెరుగవ్వాలి. అతను తన టెక్నిక్ మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే.. ఇషాన్పై ప్రత్యర్థి జట్లు స్పిన్ అస్త్రాన్ని ఎక్కువగా సంధిస్తున్నాయి. కఠినమైన పిచ్ల మీద స్ట్రయిక్ రొటేట్ చేయడం ఇషాన్ నేర్చుకోవాల’ని గంభీర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్పై డబుల్ సెంచరీ బాదిని ఇషాన్ ఇప్పటి వరకూ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. వన్డేల్లో గత మూడు ఇన్నింగ్స్ల్లో అతని అత్యధిక స్కోర్.. 17. టీ20ల్లో ఆడిన ఐదు మ్యాచుల్లో కిషన్ టాప్ స్కోర్ 37 మాత్రమే.
అహ్మదాబాద్లో ఆఖరి పోరు
రెండో టీ20లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్లో 19వ ఓవర్లో సూర్యకుమార్ ఫోర్ బాదడంతో ఇండియా విజయం సాధించింది. రెండు టీ20ల్లో ఓపెనర్లు శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్ విఫలమయ్యారు. సిరీస్ డిసైడర్ అయిన మూడో టీ20లో ఓపెనర్లు శుభారంభం ఇవ్వాలని భారత బృందం భావిస్తోంది. మూడో టీ20 ఫిబ్రవరి 1న అహ్మదాబాద్లో జరగనుంది.