హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ పర్యాటక శాఖ సహకారంతో హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ (హెచ్జీఏ) ఆధ్వర్యంలో గోల్కొండ మాస్టర్స్ టోర్నీకి మంగళవారం తెరలేచింది. యువజన, క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా పోటీలను అధికారికంగా ప్రారంభించారు. ఈనెల 12 వరకు జరిగే టోర్నీలో మొత్తం 125 మంది గోల్ఫర్లు బరిలోకి దిగుతున్నారు. ఒలింపియన్ ఉదయన్ మానె, డిఫెండింగ్ చాంపియన్ మను గందాస్, యువరాజ్సింగ్, వరుణ్ పారిఖ్, షమీమ్ఖాన్, నవీద్కౌల్ లాంటి స్టార్ గోల్ఫర్లు టైటిల్ కోసం పోటీపడనున్నారు. వీరితో పాటు హైదరాబాద్కు చెందిన హైదర్ హుస్సేన్, అజర్, హార్దిక్, తేజ్ బరిలో ఉన్నారు.