న్యూఢిల్లీ: టీ20 వరల్డ్కప్లో భాగంగా వచ్చే నెల 24న ఇండియా, పాకిస్థాన్ ( India vs Pakistan ) మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరగనున్న విషయం తెలుసు కదా. సుమారు రెండేళ్ల తర్వాత దాయాదుల మధ్య జరుగుతున్న పోరు కావడంతో ఈ మ్యాచ్ కోసం రెండు దేశాల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్లో బరిలోకి దిగబోయే టీమిండియా తుది జట్టును అంచనా వేశాడు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.
స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. టీమిండియా తుది జట్టును అతడు అంచనా వేశాడు. అయితే ఆశ్చర్యకరంగా 15 మంది సభ్యుల జాబితాలో చోటు దక్కించుకున్న స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు మాత్రం గంభీర్ టీమ్లో స్థానం దక్కలేదు. అశ్విన్ స్థానంలో యువ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్ ఆడతాడని గంభీర్ చెప్పాడు.
ఇదీ గంభీర్ టీమ్: రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తి, మహ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా.