Gautam Gambhir : సీనియర్లు అందరిదీ ఒక మాటైతే తానొక్కడిది ఒక మాటలా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్(Gautam Gambhir) వ్యవహరిస్తుంటాడు. ప్రతిసారి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేసే అతను తాజాగా టీమిండియా వలర్డ్ కప్(ODI World Cup 2023) జట్టు కూర్పుపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వన్డే ప్రపంచకప్, ఆసియా కప్(Asia Cup 2023,) వంటి మెగాటోర్నీల్లో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండర్లు ఉంటే మంచిదని రవి శాస్త్రి(Ravi Shastri) సహా పలువురు మాజీ ఆటగాళ్లు అభిప్రాయపడగా.. ఆ అవసరం ఏముందని గౌతీ ప్రశ్నించాడు. దీనికన్నా చెత్త సలహా మరొకటి లేదని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ఆటగాడిది లెఫ్ట్ హ్యాండా?, రైట్ హ్యాండా? అనేది అసలు విషయమే కాదని.. ఫామ్లో ఉన్న ప్లేయర్లను ఎంపిక చేయడం మంచిదని గంభీర్ అన్నాడు.
‘ఏ ఆటగాడైనా మంచి లయలో ఉన్నాడా? లేదా? అనేదే ముఖ్యం. అంతేకాని జట్టులో ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్లు ఉండాలి? నలుగురు రైట్ హ్యాండర్లు ఉండాలి? అనేవాటితో అవసరమే లేదు. ఎంతమంది ఎడమ చేతి వాటం బ్యాటర్లు ఉన్నారనేది ముఖ్యంకాదు. వాళ్లు ఎలా ఆడుతున్నారు? వారి ఫామ్ జట్టుకు ఏ విధంగా తోడ్పడుతుంది? అనేది మాత్రమే ముఖ్యం. అలా కాకుండా లెఫ్ట్ హ్యాండర్లు ఉండాలనే ఉద్దేశంతోనే వాళ్లనే ఎంపిక చేయడం సరికాదు’ అని గంభీర్ పేర్కొన్నాడు.
తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, శుభ్మన్ గిల్
ఈ నెల 30 నుంచి ఆసియా కప్ ప్రారంభం కానుంది. దాంతో, భారత సీనియర్ సెలెక్షన్ కమిటీ 17 మందితో కూడిన బృందాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ స్క్వాడ్లో ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్లకు అవకాశం దక్కింది. ఆల్రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు రిజర్వ్ ఓపెనర్ ఇషాన్ కిషన్(Ishan Kishan), తెలంగాణ కుర్రాడు తిలక్ వర్మ(Tilak Varma) ఎంపికయ్యారు. దీంతో జట్టులో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండర్లు ఉంటేనే మంచిదని రవి శాస్త్రి పేర్కొన్నాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ముగ్గురు ఎడమ చేతివాటం ప్లేయర్లు ఉంటే అదనపు ప్రయోజనం ఉంటుందని అన్నాడు. ప్రత్యర్థి బౌలర్లు వాళ్లను ఔట్ చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడతారని మాజీ హెడ్ కోచ్ అన్నాడు. కానీ గంభీర్ ఎప్పటిలానే భిన్నమైన వాదన వినిపిస్తున్నాడు.