మరికొన్ని రోజుల్లో భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య పోరుకు రంగం సిద్ధమైంది. రెండు దేశాల మధ్య రాజకీయ పరిస్థితుల వల్ల ద్వైపాక్షిక సిరీసులు జరగడం లేదు. ఈ నేపథ్యంలో ఐసీసీ టోర్నీల్లో మాత్రమే ఈ రెండు జట్లు తలపడుతున్నాయి. అందుకే ఆసియా కప్ కోసం క్రీడాభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే తను ఆసియా కప్ను ఒక భారీ టోర్నమెంట్గా చూస్తానని, కేవలం భారత్-పాక్ మ్యాచ్గా చూడబోనని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ తెలిపాడు.
‘‘నేను ఆడే సమయంలో అయినా సరే.. భారత్-పాక్ మ్యాచ్ అంటే నాకు అది కూడా అన్నింట్లాగే ఒక మ్యాచ్ అంతే. నేను ఎప్పుడూ మొత్తం టోర్నమెంట్ గెలిచేందుకే ప్రయత్నించేవాడిని’’ అని వివరించాడు. ఇటీవల కాలంలో భారత జట్టు అద్భుతంగా ఆడుతోందని కితాబిచ్చాడు. పలువురు మాజీ క్రికెటర్లు ఈసారి కూడా ఆసియా కప్ భారత్ సొంతమవుతుందని జోస్యం చెప్తున్న సంగతి తెలిసిందే.