ప్రపంచ క్రికెట్లో కెప్టెన్ కోహ్లీ శకం ముగిసింది. గతేడాది నవంబరులో భారత టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత అతన్ని వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తప్పించింది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా పర్యటనకు ముందు మీడియా సమావేశంలో కోహ్లీ మాట్లాడాడు.
కోహ్లీని టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని తామందరం రిక్వెస్ట్ చేశామని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ చేసిన వ్యాఖ్యలను కోహ్లీ ఖండించాడు. టీ20 కెప్టెన్గా తప్పుకోవాలన్న తన నిర్ణయాన్ని బోర్డు సభ్యులంతా స్వాగతించారని చెప్పాడు. తననెవరూ కెప్టెన్గా కొనసాగాలని అడగలేదని, వన్డే కెప్టెన్గా తొలగించే ముందు కూడా కేవలం ఒక గంట ముందే విషయం చెప్పారని వెల్లడించాడు.
దీంతో క్రికెట్ అభిమానులు భగ్గుమన్నారు. కోహ్లీ, గంగూలీ ఇద్దరిలో ఎవరు నిజం చెప్తున్నారనే విషయంలో భిన్నవాదనలు వినిపించాయి. ఇప్పుడు టెస్టె కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకోవడం మరోసారి క్రికెట్ ప్రపంచానికి షాకిచ్చింది. దీనిపై గంగూలీ కూడా స్పందించాడు.
‘‘విరాట్ సారధ్యంలో అన్ని ఫార్మాట్లలో భారత క్రికెట్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది. ఇది అతని వ్యక్తిగత నిర్ణయం. దాన్ని బీసీసీఐ ఎంతో గౌరవిస్తుంది. భవిష్యత్తులో ఈ జట్టును మరింత ఎత్తుకు తీసుకెళ్లడంలో అతనో కీలక సభ్యుడిగా ఉంటాడు. అద్భుతమైన ఆటగాడు. వెల్డన్’’ అంటూ ట్వీట్ చేశాడు.