IPL 2024 : వరల్డ్ కప్ తర్వాత క్రికెట్లో అతిపెద్ద పండుగ ఐపీఎల్(IPL 2024) మరో ఎడిషన్కు వారం రోజులే ఉంది. ఇప్పటికే అన్ని జట్లు ప్రాక్టీస్ సెషన్లతో బిజీగా ఉన్నాయి. ఈ మెగా టోర్నీకి కౌంట్డౌన్ మొదలవ్వడంతో ఆటగాళ్లు, కోచ్లు, మెంటార్లు ప్రత్యేక క్యాంప్లో ఒక్కచోట కలుస్తున్నారు. తాజాగా భారత మాజీ ఆటగాడు గౌతం గంభీర్(Gautam Gambhir).. కోల్కతా నైట్ రైడర్స్ శిబిరంలో చేరాడు. ఈసారి మెంటార్గా జట్టుతో కలిసిన గౌతీకీ అభిమానులు, ఫ్రాంచైజీ ఘన స్వాగతం పలికారు.
ఒకప్పుడు కోల్కతా మాజీ కెప్టెన్ అయిన గంభీర్ జట్టును రెండుసార్లు విజేతగా నిలిపాడు. ఇప్పుడు అతడు మెంటార్గా కొత్త అవతారంలో కోల్కతా గూటికి తిరిగొచ్చాడు. దాంతో, ఈ మాజీ ఆటగాడు కోల్కతా రాత మారుస్తాడా? పదేండ్ల ట్రోపీ కలను నిజం చేస్తాడా అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. భారత ఓపెనర్గా విజయవంతమైన గంభీర్ కెప్టెన్గానూ సత్తా చాటాడు. ఐపీఎల్లో కోల్కతా జట్టును రెండుసార్లు చాంపియన్గా నిలిపాడు. గౌతీ సారథ్యంలోని కోల్కతా 2012, 2014లో ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది.
Homecomings that hit hard 🥹💜 pic.twitter.com/YtlMAj4svW
— KolkataKnightRiders (@KKRiders) March 15, 2024
గంభీర్ వైదొలిగాక పలువురు కెప్టెన్లు మారారు. ప్యాట్ కమిన్స్, ఇయాన్ మోర్గాన్, శ్రేయాస్ అయ్యర్, నితీశ్ రానా.. ఇలా కొత్త కెప్టెన్లు జట్టును నడిపించినా కోల్కతా రాత మాత్రం మారలేదు. ఈ పదేండ్లలో ఆ జట్టు ఒక్కసారి కూడా టైటిల్ కొట్టలేదు. నిరుడు రానా సారథ్యంలో ప్లే ఆఫ్స్ ముందు కోల్కతా బొక్కబోర్లా పడింది.
Kolkatar nijer Guru, Gautam Gambhir! ✍ pic.twitter.com/gKchGAqD79
— KolkataKnightRiders (@KKRiders) March 14, 2024
దాంతో, పర్పుల్ జెర్సీ మేనేజ్మెంట్ గంభీర్తో మాట్లాడి మెంటార్గా ఒప్పించింది. 17వ సీజన్ మెగా వేలానికి ముందు జట్టుతో కలిసిన గౌతీ.. వేలంలో తన మార్క్ చూపించాడు. అతడిపై నమ్మకంతో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్(Mitchell Starc) కోసం కోల్కతా రూ.24.75 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ ఎడిషన్లో స్టార్క్ తమ తురపుముక్క అని ఇప్పటికే ప్రకటించిన గంభీర్.. మెంటార్గా తన మార్క్ చూపిస్తాడా? లేదా? అనేది మరో వారంలో తేలిపోయనుంది. 16వ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్గా వివాదాలతో వార్తల్లో నిలిచిన అతడు ఈసారి ఏం చేస్తాడో? మరి.