Virat Kohli | శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. తొలి మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడి, 87 బంతుల్లో 12 ఫోర్లు ఒక సిక్సర్ సాయంతో 113 పరుగులు సాధించాడు. వన్డే ఫార్మాట్లో 45వ సెంచరీని సాధించాడు. అదే సమయంలో శ్రీలంకపై తొమ్మిదో సెంచరీని సాధించి.. క్రికెట్ దిగ్గజం సచిన్ను అధిగమించాడు. ఈ క్రమంలో అందరు విరాట్ కోహ్లీని సచిన్తో పోలుస్తున్నారు. ఈ క్రమంలో మాజీ డ్యాషింగ్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్ లెజెండ్ సచిన్ను విరాట్తో పోల్చడంపై మండిపడ్డాడు.
కోహ్లీ ఆట తీరును ప్రశంసించిన గౌతీ.. సచిన్ కాలంలో పరుగులు చేయడం చాలా కష్టమని తెలిపాడు. ఎందుకంటే అప్పట్లో ఫీల్డింగ్ నిబంధనలు బ్యాటర్కు అనుకూలంగా ఉండేవి కావని పేర్కొన్నాడు. 30 యార్డ్స్ సర్కిల్ వెలుపల 5 కంటే ఎక్కువ మంది ఆటగాళ్లు ఉండేవారని.. కాబట్టి బౌండరీలు కొట్టడం చాలాకష్టమని.. అందుకే సచిన్ గ్రేట్ అన్నాడు. విరాట్ కోహ్లీని సచిన్తో పోల్చడం సరికాదంటూ వ్యాఖ్యానించాడు. అలాగే భారత్పై శ్రీలంక బౌలింగ్ సాధారణంగా ఉందని, శ్రీలంక బౌలింగ్ నాకు చాలా నిరాశ పరిచిందని పేర్కొన్నాడు. గంభీర్ వ్యాఖ్యలపై కోహ్లీ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.