WFI: భారత క్రీడారంగంలో క్రికెట్ చుట్టూనే తిరిగే రాజకీయాలు ఈ ఏడాది కాస్త ‘రూట్’ మార్చుకున్నాయి. ఈ ఏడాదంతా క్రికెట్ ఆట కంటే ఎక్కువగా ‘రెజ్లింగ్’ దేశ ప్రజల్లో చర్చనీయాంశమైంది. జనవరి నుంచి మొదలుకొని డిసెంబర్ 24 దాకా నిత్యం ఏదో ఒక అంశంతో ఈ క్రీడ, సంబంధిత ఆటగాళ్లు, పాలనలో ఉన్నపెద్దలు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. రింగ్లో కుస్తీ పట్టాల్సిన రెజ్లర్లు.. ఢిల్లీ వీధులపై పోరాటమనే ఆయుధాన్ని ‘పట్టు’బట్టి పోరు కొనసాగిస్తున్నారు. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) తాజా, మాజీ అధ్యక్షులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రెజ్లర్లు.. ఏడాదంతా వార్తల్లో వ్యక్తులయ్యారు. ఈ నేపథ్యంలో ఏడాది పాటు జరుగుతున్న ఈ ‘కుస్తీ’ ప్రయాణం క్లుప్తంగా…
జనవరి: జంతర్ మంతర్లో ఆందోళన
డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించాడని, ఆయనను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ జనవరిలో ప్రముఖ రెజ్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, వినేశ్ పోగట్, బబితా పోగట్లు జనవరి 19న జంతర్ మంతర్ వద్ద నిరసనలకు దిగారు.
ఫిబ్రవరి : రెజ్లర్ల నిరసనలతో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ దిగొచ్చింది. రెజ్లర్ల ఆరోపణల నేపథ్యంలో క్రీడా శాఖ.. ప్రముఖ బాక్సర్ మేరీ కోమ్ ఆధ్వర్యంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. నాలుగు వారాల్లో ఈ కమిటీ నివేదిక ఇవ్వాలని సూచించింది.
ఏప్రిల్ : ఆధారాలున్నా బ్రిజ్ భూషణ్ శరణ్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడం లేదని.. కుస్తీ యోధులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మే వరకూ అత్యున్నత న్యాయస్థానంలో దీనిపై విచారణ జరిగింది. కోర్టు జోక్యంతో ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు అతడిపై కేసు నమోదుచేశారు.
మే : బ్రిజ్ భూషణ్ అరెస్టుపై తాత్సారం చేయడంతో పాటు మేరీ కోమ్ కమిటీ ఇచ్చిన నివేదికపై అసంతృప్తి వ్యక్తం చేసిన రెజ్లర్లు మే లో మరోసారి ఆందోళనల బాట పట్టారు. ఇదే సమయంలో పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవం సందర్భంగా అటుగా ర్యాలీ తీసిన రెజ్లర్లను పోలీసులు ఈడ్చి పారేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఇదే క్రమంలో పోలీసులు.. రెజ్లర్లు ధర్నా చేస్తున్న ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. దీనిపై యూనైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) కూడా తీవ్రంగా స్పందించింది.
జూన్ : పోలీసులు, ప్రభుత్వం వ్యవహరించిన తీరు పట్ల అసంతృప్తితో ఉన్న రెజ్లర్లు తమ పతకాలను యమునా నదిలో కలపాలని నిశ్చయించుకున్నారు. కానీ రైతు సంఘం నేతల జోక్యంతో ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు. కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇచ్చిన హామీతో రెజ్లర్లు తమ పోరాటాన్ని తాత్కాలికంగా వాయిదావేశారు.
జూలై : డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. కానీ పలు కారణాల వల్ల అది వరుసగా వాయిదా పడుతూ వచ్చింది. కోర్టు పోరాటాలు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ దాకా కొనసాగాయి. ఆగస్టులో యూడబ్ల్యూడబ్ల్యూ.. సరైన సమయంలో ఎన్నికలు నిర్వహించనందుకు గాను డబ్ల్యూఎఫ్ఐ ని సస్పెండ్ చేసింది.
मैंने देश के लिए जितने भी पुरस्कार जीते हैं आप सब के आशीर्वाद से जीते हैं , मैं आप सभी देशवाशियों की हमेशा आभारी रहुंगी। 🇮🇳
कुश्ती को अलविदा ।🙏 pic.twitter.com/yyO4lG59rL— Sakshee Malikkh (@SakshiMalik) December 21, 2023
డిసెంబర్: ఈ నెల 21న ఎట్టకేలకు డబ్ల్యూఎఫ్ఐకి ఎన్నికలు జరిగాయి. బ్రిజ్ భూషణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ భారీ తేడాతో అధ్యక్షుడిగా గెలిచారు. కానీ అనంతర పరిణామాలు డబ్ల్యూఎఫ్ఐని మరోసారి వార్తల్లో నిలిపాయి. సంజయ్ సింగ్ ఎన్నికైన రోజునే సాక్షి మాలిక్ ఆట నుంచి రిటైర్మెంట్ ప్రకటించగా బజరంగ్ పునియా పద్మశ్రీని వెనక్కిచ్చేశాడు. విజయేంద్ర సింగ్ (డెఫ్లింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్) కూడా పద్మశ్రీని వెనక్కిచ్చేస్తానని అన్నాడు. దీంతో కేంద్రం దిగొచ్చింది. సంజయ్ సింగ్ నేతృత్వంలోని కొత్త ప్యానెల్ను రద్దు చేసింది.