దుబాయ్: ఐపీఎల్ 2021 ( IPL 2021 ) సీజన్ లీగ్ దశ చివరికొచ్చేసింది. మరో నాలుగు రోజుల్లో లీగ్ స్టేజ్ ముగుస్తోంది. ఇప్పటికే మూడు టీమ్స్ ప్లేఆఫ్స్ బెర్త్లు ఖాయం చేసుకున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ మొదటి టీమ్ కాగా.. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ప్లేఆఫ్స్కు క్వాలిఫై అయింది. ఆదివారం పంజాబ్పై గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా ముందడుగు వేసింది. ఇక ఇప్పుడు మిగిలింది ఒకే ఒక్క ప్లే ఆఫ్ బెర్త్. దీనికోసం నాలుగు టీమ్స్ పోటీ పడుతున్నాయి. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్తోపాటు కోల్కతా నైట్రైడర్స్, పంజాబ్కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ రేసులో ఉన్నాయి. సన్రైజర్స్ ఇప్పటికే ఇంటిదారి పట్టింది. ఈ నేపథ్యంలో ఎవరి అవకాశాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
కోల్కతా నైట్రైడర్స్
ఆదివారం సన్రైజర్స్పై గెలిచిన కోల్కతా నైట్రైడర్స్ ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ప్రస్తుతానికి మిగతా మూడు టీమ్స్ కంటే 2 పాయింట్లు ఎక్కువే ఉన్నాయి. మరొక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. చివరి మ్యాచ్లో రాజస్థాన్పై గెలిస్తే కోల్కతా పాయింట్ల సంఖ్య 14కు చేరుతుంది. అయితే వాళ్ల నెట్రన్రేట్ పాజిటివ్గా ఉండటం కోల్కతాకు ప్లస్ పాయింట్. చివరి మ్యాచ్లో ఓడితే మాత్రం కోల్కతా ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతైనట్లే.
పంజాబ్ కింగ్స్
పంజాబ్ కింగ్స్కు మరొక్క మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. పది పాయింట్లతో ఉన్న ఆ టీమ్.. చివరి మ్యాచ్లో చెన్నైపై గెలిచినా 12కు చేరుకుంటుంది. ఒకవేళ ఆ మ్యాచ్ గెలిచినా అదే రోజు (అక్టోబర్ 7) సాయంత్రం కోల్కతా, రాజస్థాన్ మ్యాచ్ ఉంది. అందులో కోల్కతా గెలిస్తే పంజాబ్ పనైపోయినట్లే. నిజానికి రాజస్థాన్పై కోల్కతా గెలిస్తే మిగతా అన్ని టీమ్స్ ఇంటికెళ్లిపోతాయి.
రాజస్థాన్ రాయల్స్
రాజస్థాన్కు ఇంకా రెండు మ్యాచ్లు ఉన్నాయి. ముంబై, కోల్కతాలతో ఆడాల్సి ఉంది. ముంబైపై గెలిస్తే ఆ టీమ్ ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి. అదే సమయంలో ముంబై ఆశలు గల్లంతవుతాయి. అయితే ఆ తర్వాత కోల్కతాపై కూడా గెలిస్తేనే రాజస్థాన్ ప్లేఆఫ్స్పై ఆశలు పెట్టుకోవచ్చు. రెండు మ్యాచ్లూ గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్. లేదంటే ఇతర టీమ్స్ జయాపజయాలు, నెట్రన్రేట్లతో పోటీ పడాల్సి ఉంటుంది.
ముంబై ఇండియన్స్
డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్ ఈ సీజన్లో చాలా చెత్తగా ఆడుతోంది. అయితే మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉన్న నేపథ్యంలో ఆ టీమ్ ప్రస్తుతానికి మూడు టీమ్స్తో సమంగా ఉంది. చివరి మ్యాచ్లో సన్రైజర్స్తో తలపడాల్సి ఉన్నా.. అంతకంటే ముందు వాళ్లు రాజస్థాన్ గండాన్ని గట్టెక్కాల్సి ఉంది. రాజస్థాన్ కూడా ప్లేఆఫ్స్పై కన్నేసింది కాబట్టి ముంబైకి అది అంత సులువు కాదు. రెండింట్లోనూ గెలిస్తే ముంబై 14 పాయింట్లకు చేరుకుంటుంది. ఒకవేళ కోల్కతా చివరి మ్యాచ్లో రాజస్థాన్పై గెలిస్తే.. వాళ్లకూ 14 పాయింట్లే ఉంటాయి. అప్పుడు నెట్రన్రేట్ కీలకం అవుతుంది. అలా అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ముంబై క్వాలిఫై అయ్యే చాన్సెస్ తక్కువే. రెండు మ్యాచ్లలోనూ భారీ విజయాలు సాధిస్తేనే ముంబై నెట్ రన్రేట్ మెరుగవుతుంది.