హైదరాబాద్ ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ను గాడిలో పెట్టేందుకు టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ముందుకొచ్చాడు. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) క్రికెట్ ఆపరేషన్స్ హెడ్గా నియమితుడైన రాయుడు మంగళవారం ఉప్పల్ స్టేడియంలో అపెక్స్ కౌన్సిల్ సభ్యుల సమక్షంలో బాధ్యతలు స్వీకరించాడు. మూడేళ్ల్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్న రాయుడు ఇకపై హెచ్సీఏలో క్రికెట్కు సంబంధించిన అన్ని అంశాలను పర్యవేక్షించనున్నాడు.
అన్నింటా పారదర్శకత, ఆటగాళ్లకే తొలి ప్రాధాన్యత అనే విధానంతో హైదరాబాద్ను దేశవాళీ క్రికెట్లో పవర్హౌస్గా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటానని అంబటి పేర్కొన్నాడు. ఇందుకోసం క్రికెట్ ఆపరేషన్స్ను ఆటోమేట్ చేయనున్నట్లు, ముంబై క్రికెట్ సంఘం తరహాలోనే ఆధునిక ప్లేయర్ కాంట్రాక్ట్ విధానాన్ని తీసుకురానున్నట్లు తెలిపాడు.
‘నేను పుట్టి పెరిగిన హైదరాబాద్ క్రికెట్కు సేవ చేసే అవకాశం రావడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. నేను 13 ఏళ్ల వయసులో ఓపెన్ ట్రయల్స్ ద్వారానే ఎంపికయ్యాను. ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లను గుర్తించడానికి మళ్లీ ఓపెన్ ట్రయల్స్ నిర్వహిస్తాం. బెంగళూరు తరహాలోహైదరాబాద్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్త్తాను. హైదరాబాద్, తెలంగాణలో ఎంతో క్రికెట్ నైపుణ్యం ఉంది. మన రాష్ట్రం నుంచి మరింత మంది క్రికెటర్లను దేశానికి అందించే బాధ్యతను ఉత్సాహంగా స్వీకరిసున్నా. హైదరాబాద్ జట్లను విజయపథంలో నడిపి అన్ని విభాగాల్లో ట్రోఫీలు నెగ్గేలా చేయడమే నా అంతిమ లక్ష్యం’అని రాయుడు పేర్కొన్నాడు.
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెడుతున్నట్టు హెచ్సీఏ కార్యదర్శి జీవన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే మహబూబ్నగర్, కరీంనగర్, నిజామాబాద్లో మైదానాలను అభివృద్ధి చేశామని, ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో మరో రెండు మూడు నెలల్లో భూములు సేకరిస్తామని వెల్లడించారు. అలాగే, అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు రిటైర్డ్ జస్టిస్ పి. విజేందర్ నేతృత్వంలో నాలుగు సభ్యుల ప్రత్యేక యాంటీ కరప్షన్ అండ్ సెక్యూరిటీ యూనిట్ (ఏసీయూ)ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మూతపడ్డ హెచ్సీఏ క్రికెట్ అకాడమీని పూర్తిగా ప్రక్షాళించి అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేస్తామన్నారు. హెచ్సీఏ లీగ్ మ్యాచ్లు ఈ నెల 12 నుంచి 10-15 గ్రౌండ్స్లో జరుగుతాయని తెలిపారు. హెచ్సీఏ సింగిల్ మెంబర్ కమిటీ జస్టిస్ పి. నవీన్రావు, అధ్యక్షుడు అమర్నాథ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.