న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్ ప్రవీణ్కుమార్ రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డాడు. మంగళవారం రాత్రి మీరట్లో ప్రవీణ్కుమార్ ప్రయాణిస్తున్న ఎస్యూవీ కారును వెనుక నుంచి ట్రైలర్ ట్రక్ బలంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా వాహనం కుదుపునకు లోనైంది. అయితే భారీ ప్రమాదం నుంచి కుటుంబంతో సహా క్షేమంగా బయటపడ్డ ప్రవీణ్కుమార్ మీడియాతో మాట్లాడుతూ ‘దేవుని దయవల్ల ఎలాంటి ప్రమాదం లేకుండా అందరం బయటపడ్డాం.
మా అల్లున్ని ఇంటి దగ్గర దింపేందుకు వెళుతున్న క్రమంలో ప్రమాదం జరిగింది. వెనుక నుంచి వచ్చిన ట్రక్ మా కారును ఢీకొట్టింది. ఎస్యూవీ కాబట్టి చిన్నచిన్న గాయాలతో బయటపడ్డాం. లేకపోతే పరిస్థితి తీవ్రంగా ఉండేది’ అని అన్నాడు. భారత్ తరఫున 36 ఏండ్ల ప్రవీణ్కుమార్ ఆరు టెస్టులు, 68 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. మరోవైపు గత డిసెంబర్లో టీమ్ఇండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదం నుంచి గాయాలతో బయటపడిన సంగతి తెలిసిందే.