భారత టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే అత్యుత్తమ బౌలింగ్ దాడి అని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కితాబిస్తే.. ప్రస్తుతం పేస్లో టీమ్ఇండియాను కొట్టే జట్టే లేదని దక్షిణాఫ్రికా దిగ్గజం షాన్ పొలాక్ అభిప్రాయపడుతున్నాడు. బుమ్రా బౌలింగ్ భళా అని సఫారీ పొడగరి అలెన్ డొనాల్డ్ ఆకాశానికి ఎత్తేస్తుంటే.. టీమ్ఇండియా ఒకప్పటి విండీస్ పేస్ దళాన్ని తలపిస్తున్నదని విశ్లేషకులు వేనోళ్ల పొగుడుతున్నారు. ‘బంతి మెరుపు పోగొట్టేందుకే భారత పేసర్లు’ అనే అపవాదు నుంచి.. అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ దళం.. అనే స్థితికి వచ్చేందుకు మనవాళ్లు పడ్డ కష్టాన్ని ఓ సారి పరిశీలిస్తే..
(నమస్తే తెలంగాణ క్రీడావిభాగం): ‘టెస్టు మ్యాచ్ నెగ్గాలంటే ప్రత్యర్థిని రెండు సార్లు ఆలౌట్ చేయాల్సిందే’.. విరాట్ కోహ్లీ నాయకత్వ పగ్గాలు చేపట్టిన కొత్తలో అన్న మాటలివి. వినడానికి చాలా సాధారణంగానే ఉన్నా.. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లండ్ వంటి జట్లతో వారి ఇలాఖాలో ఆడుతున్నప్పుడు ఇదెంత కష్టమో భారత అభిమానులకు బాగా తెలుసు. అయితే కోహ్లీ కేవలం మాటలు చెప్పి వదిలేయకుండా.. అవసరమైతే ఒక బ్యాట్స్మన్ను తగ్గించుకునైనా సరే.. ఐదుగురు బౌలర్ల సూత్రాన్ని కచ్చితంగా అమలు చేసుకుంటూ వచ్చాడు. సుదీర్ఘ కాలంగా ఈ ప్రణాళిక కొనసాగుతూ రావడంతో భారత జట్టుకు మ్యాచ్ విన్నింగ్ బౌలర్లు లభించారనడంలో సందేహం లేదు. ఒకప్పుడు విదేశాల్లోనూ స్పిన్నర్లనే నమ్ముకునే టీమ్ఇండియా.. ఇటీవలి కాలంలో పేసర్ల దమ్ముతోనే విజయాలు సాధిస్తున్నది. దీనికి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ పర్యటనలే ఉదాహరణ.
కపిల్ దేవ్ను తలపిస్తూ..
దిగ్గజ కెప్టెన్, హర్యానా హరికేన్ కపిల్దేవ్ తన పేస్ సత్తాతో భారత జట్టుకు విజయాలు అందించిన సందర్భాలు కోకొల్లలు. అయితే ఆ తర్వాత చాన్నాళ్ల వరకు భారత్కు చెప్పుకోదగ్గ పేసర్ తారసపడలేదు. భారత జట్టు ఉపఖండంలోనే ఎక్కువ మ్యాచ్లు ఆడటంతో.. స్పిన్నర్లను తయారు చేయడంతోనే సరిపెట్టుకుంది. మధ్యలో జవగళ్ శ్రీనాథ్, వెంకటేశ్ ప్రసాద్ వంటి వాళ్లు కాస్త ఆశలు రేపినా.. జహీర్ ఖాన్ తప్ప మరో నమ్మదగ్గ పేసర్ మాత్రం దొరకలేదు. కానీ గత నాలుగేండ్లలో భారత పేస్ బౌలింగ్ ముఖచిత్రమే మారిపోయింది. బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ శిక్షణలో మనవాళ్లు చురకత్తుల్లా తయారయ్యారు. జహీర్ అనుభవాలను గుర్తెరిగిన కొత్త తరం.. గాయాల బారిన పడకుండా ఎలా సాధన చేయాలనే దానిపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ఫిట్నెస్ మెరుగుపర్చుకోవడం, కఠోర కసరత్తులు, సుదీర్ఘ స్పెల్లు, గంటల తరబడి నెట్స్లో చెమటోడ్చడం ఇలా ఒక్కటేమిటి.. గత కొన్నేళ్లు మనవాళ్లు పడ్డ కష్టం అంతా ఇంతా కాదు.
బెంచ్ బలంగా..
బుమ్రా, షమీ, ఇషాంత్, సిరాజ్ రూపంలో నలుగురు స్పెషలిస్ట్ పేసర్లు ప్రస్తుతం జట్టులో ఉండగా.. తొలి టెస్టులో శార్దూల్ ఠాకూర్ తన పేస్ పవర్ చూపించాడు. ఇక అవకాశం కోసం మరో సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్ బెంచ్పై కాచుకు కూర్చోగా.. భువనేశ్వర్ కుమార్, నవ్దీప్ సైనీ, దీపక్ చాహర్, అవేశ్ ఖాన్ వంటి వాళ్లు జట్టులో చోటు కోసం నిరీక్షిస్తున్నారు. పేస్ విభాగంలో ఒకరిద్దరు మినహా.. పెద్దగా పోటీనే ఉండని రోజుల నుంచి.. జట్టులో చోటు దక్కాలంటే అత్యుత్తమ ప్రదర్శన చేయక తప్పదనే స్థాయికి భారత పేస్ విభాగం ఎదిగింది. దీని వెనుక కోచ్ రవిశాస్త్రి మాస్టర్ మైండ్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కష్టం, స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్ శంకర్ బసు నిబద్ధత దాగి ఉన్నాయి.
ముగ్గురు వద్దు.. నలుగురు ముద్దు
ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు.. దశాబ్దాలుగా భారత బౌలింగ్ దళం కూర్పు ఇది. అయితే విదేశీ పిచ్లపై అదనపు స్పిన్నర్ను తీసుకోవడం ద్వారా ఫలితం లేదని భావించిన విరాట్.. నలుగురు పేసర్ల సూత్రానికే మొగ్గు చూపాడు. అలసట లేకుండా జోడీలుగా సుదీర్ఘ స్పెల్స్ వేసేందుకు ఇది బాగా తోడ్పడింది. గతంలో ఓ పేస్ జోడీ బౌలింగ్ దాడి కొనసాగించి ప్రత్యర్థి బ్యాట్స్మెన్పై ఒత్తిడి తెస్తే.. మరో ఎండ్ నుంచి పరుగులు చేసేందుకు స్పిన్నర్లు అవకాశం కల్పించి ఒత్తిడిని దూరం చేసేవారు. దీంతో పేసర్లు పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరయ్యేది. ప్రస్తుతం అందుకు భిన్నంగా.. కొత్త బంతితో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ నిప్పులు చెరుగుతుంటే.. బంతి పాతబడ్డాక సీనియర్ ఇషాంత్ శర్మ, హైదరాబాదీ మహమ్మద్ సిరాజ్ ప్రత్యర్థులతో ఆటాడుకుంటున్నారు.
ఏకైక స్పిన్నర్తోనే..
ఇంగ్లండ్తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు రవిచంద్రన్ అశ్విన్కు జట్టులో చోటు కల్పించకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. పిచ్తో సంబంధం లేకుండా అశ్విన్ బంతిని స్పిన్ చేయగలడని.. అతడి అనుభవం జట్టుకు కలిసొచ్చేదని సవాలక్ష మాటలు వినిపించాయి. అయితే తేమతో కూడిన వాతావరణంలో నలుగురు ఫాస్ట్ బౌలర్లు ఉండాల్సిందేనని పట్టుబట్టిన కోహ్లీ.. పేస్తోనే ఫలితాలు తారుమారవుతాయి అని నిరూపించాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టుకున్న మన పేస్ దళం గత రెండు టెస్టుల్లో 40 వికెట్లకు గాను 39 వికెట్లు తమ ఖాతాలో వేసుకోవడం విశేషం. ఇటీవలి కాలంలో బ్యాటింగ్లోనూ మనవాళ్లు రాణిస్తుండటం జట్టుకు అదనపు ప్రయోజనాన్ని కలిగిస్తున్నది. ఆస్ట్రేలియా పర్యటనలో లోయర్ ఆర్డర్ పోరాటంతోనే సిరీస్ చేజిక్కించుకున్న టీమ్ఇండియా.. లార్డ్స్ టెస్టులోనూ షమీ, బుమ్రా బ్యాటింగ్తోనే మెరుగైన స్థితికి చేరింది. కీలకమైన సమయాల్లో బ్యాట్తోనూ జట్టుకు సహకరించడం మనవాళ్ల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తున్నది. ఇదే బౌలింగ్లో ప్రస్ఫుటమవుతున్నది.