కోల్కతా: పెహల్గామ్ ఉగ్రదాడి ఘటన పట్ల భారత మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ(Sourav Ganguly) ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్తో అన్ని క్రికెట్ సంబంధాలను తెంచుకోవాలని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కోల్కతాలో ఆయన ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. పాకిస్థాన్తో క్రికెట్ బంధాన్ని వంద శాతం నిలిపివేయాలని, చాలా కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఇలాంటి ఘటనలు జరగడం జోక్గా తీసుకోవద్దు అని, ఉగ్రవాదాన్ని సహించలేమని గంగూలీ తెలిపారు. వాస్తవానికి చాన్నాళ్ల నుంచి పాక్, ఇండియా మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ జరగడం లేదు. ఇటీవల కేవలం ఐసీసీ నిర్వహించే ఈవెంట్లలో మాత్రమే ఆ రెండు దేశాలు పోటీపడుతున్నాయి.
రెండు దేశాల మధ్య ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 2008 నుంచి పాక్లో ఇండియా పర్యటించలేదు. చివరిసారి ఆసియాకప్లో ఆ జట్లు తలపడ్డాయి. 2012-13లో చివరిసారి ద్వైపాక్షిక సిరీస్లో పాల్గొన్నాయి. ఇటీవల నిర్వహించిన ఐసీసీ టోర్నీలో పాల్గొన్నా.. పాకిస్థాన్లో ఆడేందుకు మాత్రం ఇండియా నిరాకరించింది. దుబాయ్లోనే ఆ దేశంతో మ్యాచ్లు ఆడింది. ఇండియా, పాకిస్థాన్ మధ్య హైబ్రిడ్ మోడల్ క్రికెట్ జరగాలని ఇటీవల ఐసీసీ నిర్ణయించిన విషయం తెలిసిందే. తటస్థ వేదికలపై ఆడేందుకు నిర్ణయించారు. కానీ ఇప్పుడు ఆ వేదికల్లోనూ ఆడరాదు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.