కువైట్ : ప్రపంచకప్ క్వాలిఫయర్స్ ఫుట్బాల్ పోటీలలో భాగంగా భారత జట్టు గురువారం స్థానిక జేబర్ అల్-అహ్మద్ స్టేడియంలో కువైట్తో తలపడనున్నది. గ్రూపు-ఎలో ఖతార్, కువైట్, అఫ్గానిస్థాన్ కూడా పోటీపడుతున్నాయి. ఆసియానుంచి ఫిఫా క్వాలిఫయర్స్లో భారత జట్టు ఇప్పటివరకు మూడో రౌండ్ పోటీలకు అర్హత సాధించలేదు. గ్రూపులో తొలి రెండు స్థానాలలో నిలిచిన జట్లు మూడో రౌండ్కు అర్హత సాధిస్తాయి. ఆసియా చాంపియన్ ఖతార్ తరువాత ఈ గ్రూపులో తదుపరి రౌండ్కు భారత్కే అవకాశాలు ఎక్కువ. ఫిఫా ర్యాంకింగ్స్లో భారత్ 102 స్థానంలో ఉండగా, కువైట్ 136వ స్థానంలో కొనసాగుతున్నది.
ర్యాంకింగ్లో తక్కువగా ఉన్నప్పటికీ కువైట్ శాఫ్ చాంపియన్షిప్లో భారత్తో తలపడిన రెండుసార్లు మ్యాచ్లను డ్రాగా ముగించింది. గురువారంనాటి మ్యాచ్పైనే భారత జట్టు భవితవ్యం ఆధారపడి ఉంది. గత అయిదు అంతర్జాతీయ మ్యాచ్లలో భారత జట్టు రెండు పరాజయాలు, మూడు డ్రాలను సాధించగా, కువైట్ జట్టు రెండు విజయాలు, రెండు పరాజయాలు, ఒక డ్రాతో మెరుగ్గా ఉంది. దీనికితోడు సొంతగడ్డపై ఆడుతుండడం కువైట్కు అనుకూలించే అంశం. అయినా ఈ మ్యాచ్లో గెలిచేందుకు సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమేనని భారత కెప్టెన్ సునీల్ ఛెత్రి విశ్వాసం వ్యక్తంచేశాడు. మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ప్రారంభమౌతుంది.