జమోరా : లివర్పూల్ జట్టు తరపున ఆడే ప్రఖ్యాత పోర్చుగీస్ ఫుట్బాల్ ప్లేయర్ డియాగో జోటా(Diogo Jota) కారు ప్రమాదంలో మృతిచెందాడు. స్పెయిన్లోని జమోరాలో ఆ ప్రమాదం జరిగింది. ఆ దుర్ఘటనలో అతని సోదరుడు ఆండ్రే ఫిలెపి కూడా ప్రాణాలు కోల్పోయాడు. లాంబోర్గిని కారులో వెళ్తున్న సోదరులు.. మరో కారును ఓవర్టేక్ చేస్తున్న సమయంలో టైరు పేలింది. దీంతో కారులో మంటలు వ్యాపించాయి. అక్కడిక్కడే ఆ ఇద్దరూ మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు.
రెండు వారాల క్రితమే జోటా పెళ్లి చేసుకున్నాడు. తన జీవిత భాగస్వామి రూటో కార్డోసోను అతను పెళ్లాడాడు. ఆ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. జూన్ 22వ తేదీన ఆ ఇద్దరికీ మ్యారేజ్ జరిగింది. గత ఏడాది లివర్పూల్ జట్టు ఫుట్బాల్ ప్రీమియర్ లీగ్ టైటిల్ నెగ్గిన విషయం తెలిసిందే. ఆ జట్టులో జోటా సభ్యుడే.
పోర్చుగల్ జాతీయ జట్టు తరపున కూడా జోటా ఆడాడు. ఆ దేశం యూఈఎఫ్ఏ టోర్నీ గెలవడంలో అతను కీలక పాత్ర పోషించాడు. ఫార్వర్డ్ ప్లేయర్గా జోటాకు మంచి రికార్డు ఉన్నది.