దుబాయ్: వచ్చే ఐపీఎల్ సీజన్లో ధోనీ ఉంటాడో లేదోనని ఆందోళన చెందుతున్న అభిమానులకు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది. తాము ఉపయోగించబోయే తొలి రిటెన్షన్ కార్డు ధోనీ కోసమే అని సీఎస్కే అధికారి ఒకరు అధికారికంగా ప్రకటించారు. రిటెన్షన్ కచ్చితంగా ఉంటుంది. అది నిజం. అయితే ఎన్ని రిటెన్షన్లు ఉంటాయన్నదానిపై మాకు స్పష్టత లేదు. కానీ నిజాయతీగా చెప్పాలంటే ధోనీ విషయంలో ఇవి పట్టించుకోము. ఎందుకంటే తొలి రిటెన్షన్ అతని కోసమే. ఓడకు కెప్టెన్ అవసరం ఉంది. అతడు కచ్చితంగా వచ్చే ఏడాది ఆడతాడు అని ఆ అధికారి ఏఎన్ఐతో అన్నారు.
తాను సీఎస్కేతోనే ఉండాలని అనుకుంటున్నానని, చెన్నైలో ఫేర్వెల్ గేమ్ ఆడాలని అనుకుంటున్నట్లు గతంలో ధోనీ చెప్పాడు. ఇప్పుడది నిజమయ్యేలానే కనిపిస్తోంది. వచ్చే సీజన్లో కొత్తగా రెండు టీమ్స్ వస్తున్నాయని, రిటెన్షన్ పాలసీ ఎలా ఉంటుందో కూడా తెలియదని ఇంతకుముందు ధోనీ అన్నాడు. అతని మాటలను బట్టి ఈ సీజన్ తర్వాత ధోనీ ఐపీఎల్ నుంచి రిటైరవుతాడన్న అనుమానాలు దృఢమయ్యాయి. ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ధోనీ ఇవే కామెంట్స్ చేశాడు.