IPL 2023 | లక్ష మందికి పైగా అభిమానులతో కిక్కిరిసిన మైదానంలో వేసవి వినోదాల విందుకు నగారా మోగగా.. ఐపీఎల్-16వ సీజన్ తొలి పోరులో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ బోణీ కొట్టింది. టాస్ నెగ్గడంతోనే సగం మ్యాచ్ చేజిక్కించుకున్న హార్దిక్ సేన.. సొంతగడ్డపై సింహనాదం చేయగా.. అంతర్జాతీయ స్టార్లు చేతులెత్తేయడంతో చెన్నైకి పరాభవం తప్పలేదు. సహచరులంతా చేతులెత్తేసిన వేళ రుతురాజ్ ఒంటరి పోరాటం చేస్తూ సిక్సర్ల జోరుతో స్టేడియాన్ని హోరెత్తించగా.. ఛేదనలో యువ ఓపెనర్ శుభ్మన్గిల్ సహా తలా కొన్ని పరుగులు చేయడంతో గుజరాత్ శుభారంభం చేసింది.
అహ్మదాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్కు అదిరే ఆరంభం లభించింది. గత మూడేండ్లుగా పరిమితుల మధ్య సాగిన ఐపీఎల్ ఈసారి పూర్తి స్థాయి ప్రేక్షకులతో ఇంటా, బయట పద్ధతిలో ఘనంగా ప్రారంభమైంది. శుక్రవారం అట్టహాసంగా సాగిన ఆరంభ వేడుకల అనంతరం జరిగిన తొలి పోరులో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ 5 వికెట్ల తేడాతో మాజీ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ను చిత్తుచేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (50 బంతుల్లో 92; 4 ఫోర్లు, 9 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. తక్కినవాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. భారీ అంచనాల మధ్య మైదానంలో అడుగుపెట్టిన ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ (7)తో పాటు డ్వేన్ కాన్వే (1), రవీంద్ర జడేజా (1) విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్ 19.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. యంగ్ గన్ శుభ్మన్ గిల్ (36 బంతుల్లో 63; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచికొట్టగా.. వెటరన్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా (16 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్సర్లు)తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్గా జట్టులోకి వచ్చిన సాయి సుదర్శన్ (22), ఆల్రౌండర్ విజయ్ శంకర్ (21 బంతుల్లో 27; 2 ఫోర్లు, ఒక సిక్సర్) పర్వాలేదనిపించారు. చెన్నై బౌలర్లలో రాజ్వర్ధన్ 3 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. రషీద్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఐపీఎల్-16వ సీజన్లో శనివారం తొలి డబుల్ హెడర్ జరుగనుండగా.. మొదటి మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్.. రెండో పోరులో లక్నో సూపర్ జెయింట్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి.
దాదాపు ఏడాది కాలం తర్వాత మైదానంలో దర్శనమిచ్చిన మహేంద్రసింగ్ ధోనీకి టాస్ కలిసి రాలేదు. టాస్ నెగ్గితే తొలుత బౌలింగ్ చేయాలని మహీ భావించినా.. అది సాధ్యపడకపోవడంతో చెన్నై మొదట బ్యాటింగ్ చేసింది. తొలి ఓవర్ కట్టుదిట్టంగా వేసిన గుజరాత్ పేసర్ మహమ్మద్ షమీ.. తన రెండో ఓవర్లో కాన్వేను క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే రుతురాజ్కు మోయిన్ అలీ జత కలవడంతో ఇన్నింగ్స్ సజావుగా సాగింది. ఈ జోడీ వీలుచిక్కినప్పుడల్లా బౌండ్రీలు బాదడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. మోయిన్ అలీ బౌండ్రీలపై దృష్టి పెడితే.. సిక్సర్లు కొట్టడానికి క్రీజులోకి వచ్చినట్లు గైక్వాడ్ వీరంగమాడాడు. కుదురుకున్నాడనుకున్న అలీ.. రషీద్ బౌలింగ్లో కీపర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరగగా.. ఆ తర్వాత ఏ ఒక్కరూ క్రీజులో నిలిచే ప్రయత్నం చేయలేదు. హర్దిక్ ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన గైక్వాడ్.. అల్జారీ జోసెఫ్ బౌలింగ్లో మూడు సిక్సర్లు అరుసుకున్నాడు. ఈ క్రమంలో గైక్వాడ్ 23 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఒక దశలో 9 ఓవర్లలో చెన్నై 90 పరుగులతో నిలువగా.. మిడిల్ ఓవర్స్లో పరుగుల రాక మందగించింది. అప్పటికే స్టోక్స్ కూడా వెనుదిరగగా.. రాయుడు (12), శివమ్ దూబే (19) నెమ్మదిగా ఆడారు. సెంచరీకి 8 పరుగుల దూరంలో రుతురాజ్ వెనుదిరగగా.. చివర్లో ధోనీ (7 బంతుల్లో 14 నాటౌట్; ఒక ఫోర్, ఒక సిక్సర్) బ్యాట్కు పనిచెప్పడంతో చెన్నై ఆ మాత్రం స్కోరు చేయగలిగింది.
ఐపీఎల్లో తొలిసారి ప్రవేశ పెట్టిన ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధనను మొదటి మ్యాచ్లో ఇరు జట్లు వినియోగించుకున్నాయి. బ్యాటింగ్లో అంబటి రాయుడు సేవలను వినియోగించుకున్న చెన్నై సూపర్ కింగ్స్.. బౌలింగ్కు దిగే సమయంలో జట్టు నుంచి రాయుడును తప్పించి అతడి స్థానంలో పేస్ బౌలర్ తుషార్ దేశ్పాండేను బరిలో దింపింది. ఐపీఎల్లో తొలి ఇంపాక్ట్ ప్లేయర్గా తుషార్ రికార్డుల్లోకెక్కాడు. మరోవైపు గుజరాత్ టైటాన్స్ కూడా ఈ నిబంధనను వాడుకుంది. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడ్డ న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ స్థానంలో.. సాయి సుదర్శన్ను ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా తీసుకుంది.
గత మూడేండ్లుగా ఎలాంటి ఆర్భాటాలు లేకుండానే సాగుతున్న ఐపీఎల్.. ఈ సారి అట్టహాసంగా ప్రారంభమైంది. కరోనా కారణంగా మూడేండ్ల నుంచి ఆరంభ వేడుకలు నిర్వహించకపోగా.. ఈసారి పరిస్థితులు అనుకూలించడంతో భారీ ఏర్పాట్ల మధ్య ఐపీఎల్ 16వ సీజన్కు తెరలేచింది. కండ్లు మిరుమిట్లు గొలిపే బాణాసంచా వెలుగులు.. చెవులు మోతెక్కే మ్యూజిక్ షో.. ఆకాశంలో అద్భుతాన్ని ఆవిష్కరించిన డ్రోన్ షోతో మెగాలీగ్కు అంకురార్పణ జరిగింది. మ్యాచ్ ఆరంభానికి ముందు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు అభిమానులను కట్టిపడేశాయి. ప్రపంచంలోనే అతిపెద్దదైన అహ్మదాబాద్ స్టేడియంలో లక్ష మందికి పైగా ప్రేక్షకుల సమక్షంలో గానా బజానా కార్యక్రమం ఆహుతులను ఆకట్టుకుంది. బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ మ్యూజిక్ షోతో ప్రారంభమైన ఆరంభ వేడుకల్లో సినీ తారాలు తమన్నా భాటియా, రష్మిక మందన సందడి చేశారు. పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా మామా’ పాటకు తమన్నా అదిరే స్టెప్పులు వేయగా.. కాసేపటికి వేదికపైకి వచ్చిన రష్మిక మందన.. పుష్పలోని ‘సామీ సామీ’ పాటకు కాలు కదిపింది. తన ట్రేడ్ మార్క్ స్టెప్లతో రష్మిక స్టేడియాన్ని హోరెత్తించింది. దీంతో పాటు ఆర్ఆర్ఆర్లోని ఆస్కార్ సాంగ్ ‘నాటు నాటు’కు రష్మిక తనదైన స్టెప్పులతో అలరించింది. అనంతరం హోస్ట్ మందిరా బేడీ.. బీసీసీఐ పెద్దలను స్టేజ్ మీదకు ఆహ్వానించగా.. బోర్డు అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా, కోశాధికారి అరుణ్ ధూమల్తో పాటు ఇరు జట్ల కెప్టెన్లు ఐపీఎల్ ట్రోఫీతో ఫొటోలకు ఫోజులిచ్చారు.
చెన్నై: 178/7 (రుతురాజ్ 92, అలీ 23; రషీద్ 2/26, షమీ 2/29), గుజరాత్: 19.2 ఓవర్లలో 182/5 (గిల్ 63, శంకర్ 27; రాజ్వర్ధన్ 3/36).