న్యూఢిల్లీ : భారత నంబరవన్ షట్లర్ లక్ష్యసేన్పై బెంగళూరు పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు అయింది. లక్ష్యసేన్, అతని కుటుంబం, కోచ్ విమల్ కుమార్కు వ్యతిరేకంగా ఇది దాఖలైంది. లక్ష్యసేన్, అతని సోదరుడు చిరాగ్ సేన్ వయసు విషయంలో తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించారని గోవియప్ప నాగరాజ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
ఈ నేపథ్యంలో సెక్షన్ 420(మోసం), 468( ఫోర్జరీ), 471(తప్పుడు ధృవీకరణ పత్రం అసలైనదిగా సమర్పించడం), 34(ఉద్దేశపూర్వకంగా పలువురు మోసం చేయడం)ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫిర్యాదిదారు నగరంలో మరో శిక్షణ సంస్థ యజమాని కావడం గమనార్హం. దీనిపై కోచ్ విమల్కుమార్ స్పందిస్తూ ఆరోపణలన్నీ అవాస్తవమని, ఉద్దేశపూర్వకంగా చేసినవని, లక్ష్యసేన్ను మానసికంగా దెబ్బతీసేందుకు ఈ కేసు పెట్టారని వ్యాఖ్యానించాడు. కాగా ఈ ఆరోపణలపై లక్ష్యసేన్ కుటుంబం ఇంకా స్పందించలేదు.