ముంబై: భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీపై కేసు నమోదైంది. మద్యం మత్తులో భార్యపై దాడి చేసినందుకు గానూ బాంద్రా పోలీసులు కాంబ్లీపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పరుష పదాలతో దుర్భాషలాడటంతో పాటు వంట సామాగ్రితో తనపై దాడి చేసినట్లు కాంబ్లీ భార్య ఆండ్రియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకున్నట్లు ఆమె పేర్కొంది. పన్నెండేండ్ల కుమారుడి సమక్షంలోనే కాంబ్లీ తనపై విచక్షణారహితంగా దాడి చేసినట్లు ఆమె వెల్లడించింది. దీంతో కాంబ్లీపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన బాంద్రా పోలీసులు.. ఆండ్రియాను దవాఖానాకు తరలించారు. ఐపీసీ సెక్షన్ 324, 504 కింద కాంబ్లీపై కేసు నమోదు చేసినట్లు బాంద్రా పోలీసులు తెలిపారు. కెరీర్ తొలినాళ్లలో దూకుడైన ఆటతీరుతో అందరికీ దగ్గరైన కాంబ్లీ.. ఆ తర్వాత క్రమశిక్షణా రాహిత్యం, చెడు వ్యసనాల బారినపడి కెరీర్ నాశనం చేసుకున్నాడు.