దుబాయ్: భారత క్రికెట్ పండుగ ఐపీఎల్లో వచ్చే ఏడాది నుంచి రెండు కొత్త జట్లు చేరనున్న సంగతి తెలిసిందే. ఈ కొత్త ఫ్రాంచైజీల కోసం టెండర్ల ప్రక్రియ ముగిసిందని, కాసేపట్లో ఫలితాలు వెల్లడిస్తామని ఐపీఎల్ యాజమాన్యం వెల్లడించింది. కొత్త ఫ్రాంచైజీల కోసం ఆరు సిటీలను ఐపీఎల్ యాజమాన్యం గుర్తించింది. అవి అహ్మదాబాద్, లక్నో, కటక్, ధర్మశాల, గువాహటి, ఇండోర్.
ఈ సిటీల నుంచే రెండు కొత్త ఫ్రాంచైజీలు రానున్నాయి. ఈ వేలం కోసం టెండర్లు వేసే డాక్యుమెంట్ల ఖరీదు రూ. 10 లక్షలు. మొత్తం 22 కంపెనీలు టెండర్ పత్రాలు కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే కొత్త ఐపీఎల్ జట్ల బేస్ ధరను రూ. 2 వేల కోట్లుగా ఐపీఎల్ యాజమాన్యం నిర్ణయించడంతో ఈ పోటీ బాగా తగ్గిపోయింది. చివరకు కేవలం పది కంపెనీలు మాత్రమే వేలంలో నిలబడ్డాయి.
ఈ కంపెనీలు కూడా తమ పత్రాలు సమర్పించాయని, ఫలితాలను త్వరలో వెల్లడిస్తామని ఐపీఎల్ యాజమాన్యం తెలిపింది. టెండర్లు ఒక కంపెనీ లేదా వ్యక్తి లేదంటే మూడు కంపెనీల కన్సార్షియం కలిసి వేయవచ్చని బీసీసీఐ తెలిపింది.
అయితే ఒక కంపెనీ లేదా వ్యక్తి ఈ టెండర్ వేయాలంటే వారి వార్షిక టర్నోవర్ కనీసం రూ.3 వేల కోట్లుండాలని, అదే మూడు కంపెనీల కన్సార్షియం అయితే ఒక్కో కంపెనీ వార్షిక టర్నోవర్ కనీసం రూ.2,500 కోట్లు ఉండాలని ఐపీఎల్ నిబంధనలు విధించింది.
ఈ క్రమంలో పోటీలో అదానీ గ్రూప్, హిందుస్తాన్ మీడియా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్పీ సంజీవో గోయెంకా గ్రూప్ ఉన్నట్లు తెలుస్తోంది. భారత జట్టు మాజీ సారధి ధోనీని రిప్రజెంట్ చేసిన రితి స్పోర్ట్స్ కూడా ఈ పోటీలో ఉన్నట్లు సమాచారం.