సిటీ బ్యూరో, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): బుల్లెట్ వేగం.. మెరుపు వేగం.. వాయు వేగం.. ఎలా ఉంటుందో నగరవాసులకు పరిచయం చేసిన ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్) విజయవంతంగా ముగిసింది. రెప్పపాటులో దూసుకుపోయే కార్లు.. రోమాలు నిక్కబొడిచేలా చేసే రేసర్ల విన్యాసాలు.. రయ్ రయ్మంటూ గర్జించే శబ్దాలతో రసవత్తరంగా సాగిన ఐఆర్ఎల్లో గాడ్స్పీడ్ కొచ్చి జట్టు ఓవరాల్ చాంపియన్గా నిలిచింది. హైదరాబాద్, చెన్నైల్లో కలిపి మొత్తం నాలుగు అంచెల్లో నిర్వహించిన ఈ లీగ్లో 417.5 పాయింట్లు ఖాతాలో వేసుకున్న కొచ్చి టాప్ ప్లేస్ దక్కించుకోగా.. హైదరాబాద్ బ్లాక్బర్డ్స్ (385 పాయింట్లు) రన్నరప్గా నిలిచింది. దేశంలోని ఆరు ప్రధాన జట్లు పాల్గొన్న ఈ లీగ్లో.. గోవా (282), చెన్నై (279), బెంగళూరు (147.5), ఢిల్లీ (141) ఆ తర్వాతి స్థానాలు దక్కించుకున్నాయి. ఆదివారం ఉదయం నుంచి చిరుజల్లులు కురవడంతో.. వాతావరణం అనుకూలంగా లేకపోయినా నిర్వాహకులు విజయవంతంగా రేసులు జరిపి ప్రశంసలు అందుకున్నారు. శనివారం సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన క్వాలిఫయింగ్, స్ప్రింట్ రేసులను కూడా ఆదివారమే నిర్వహించారు. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో హుసేన్ సాగర్ తీరంలో కార్లు దూసుకెళ్తుంటే.. అభిమానులు ఆనంద డోలికల్లో మునిగి తేలారు. కాగా, ఈ పోటీలను వీక్షించేందుకు సినీ హీరోలు నాగచైతన్య, రామచరణ్ దంపతులు విచ్చేసి సందడి చేశారు.