భారీ ఆశలతో బర్మింగ్హామ్ బరిలోకి దిగిన భారత మహిళల హాకీ జట్టుకు అనూహ్య పరాజయం ఎదురైంది. అంపైర్ల తప్పిదానికి మన జట్టు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో భారత్ పరాజయం పాలైంది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు ఒక్కో గోల్ కొట్టగా.. ఫలితం తేల్చేందుకు నిర్వహించిన షూటౌట్లో భారత్ 0-3తో వెనుకంజలో నిలిచింది. నిర్ణీత సమయంలో ఆసీస్ తరఫున రెబెకా (10వ ని.లో) తొలి గోల్ సాధించగా.. భారత్ తరఫున వందనా కటారియా (49వ ని.లో) ఏకైక గోల్ చేసింది. ఆదివారం జరుగనున్న కాంస్య పోరులో న్యూజిలాండ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.
అంపైర్ల తప్పిదంతో..
నిర్ణీత సమయంలో ఫలితం తేలకపోవడంతో షూటౌట్ ప్రారంభించగా.. తొలి ప్రయత్నంలో ఆస్ట్రేలియా స్ట్రయికర్ రోసీ మలోన్ను భారత గోల్కీపర్ సవిత అడ్డుకుంది. అయితే ఈ దశలో అక్కడికి చేరుకున్న అంపైర్లు.. టెక్నికల్ తప్పిదం జరిగిందని రోసీకి మరోసారి అవకాశమిచ్చారు. ఇదేంటని భారత ఆటగాళ్లు వాదిస్తే.. అధికారులు స్టాప్ వాచ్ను సరైన సమయంలో ప్రారంభించలేదని అందుకోసమే ఆస్ట్రేలియాకు మరో అవకాశం కల్పిస్తున్నామని నిర్వాహకులు సమాధానమిచ్చారు. రెండోసారి అవకాశం దక్కించుకున్న రోసీ గోల్ సాధించగా.. అదే జోరులో ఆస్ట్రేలియా వరుసగా మూడు గోల్స్ వేసింది. ఒత్తిడిలో పడ్డ భారత ఆటగాళ్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోవడంతో ఆసీస్ 3-0తో ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ విషయంపై సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేయగా.. అంతర్జాతీయ హాకీ సమాఖ్య క్షమాపణలు చెప్పింది.