హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) రాజకీయాలు రోడ్డెక్కాయి. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు జరుగుతున్న ఆధిపత్య పోరులో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మహమ్మద్ అజారుద్దీన్ను తిరిగి హెచ్సీఏ అధ్యక్షునిగా నియమించిన అంబుడ్స్మన్ జస్టిస్ దీపక్వర్మ.. అపెక్స్ కౌన్సిల్ సభ్యులపై తాత్కాలికంగా వేటు వేయడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. దీనిపై సోమవారం జింఖానా మైదానంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కౌంటర్గా సమాధానమిద్దామనుకున్న అపెక్స్ కౌన్సిల్ సభ్యులకు అనుకోని రీతిలో చుక్కెదురైంది. శాంతిభద్రతల సమస్య పేరుతో సభ్యులను స్టేడియం దగ్గరే పోలీసులు ఆపేయడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
అజర్ వైఖరిని నిరసిస్తూ అపెక్స్ కౌన్సిల్ సభ్యులు.. ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్, కార్యదర్శి విజయానంద్, సంయుక్త కార్యదర్శి నరేశ్ శర్మ మైదానం గేటు వద్దే మీడియా సమావేశాన్ని నిర్వహించారు. సంఘ విద్రోహ శక్తుల వల్ల సమస్యలు ఏర్పడే అవకాశముందన్న అజర్ సూచనతో సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారని జాన్మనోజ్ మీడియాకు వివరించాడు. ప్రస్తుతం హెచ్సీఏలో జరుగుతున్న పరిణామాలపై జాన్ మనోజ్ మాట్లాడుతూ.. ‘మమ్మల్ని సస్పెండ్ చేసే అధికారం జస్టిస్ దీపక్వర్మకు లేదు. ఏప్రిల్లో జరిగిన ఏజీఎమ్ సమావేశంలో మెజార్టీ సభ్యులు జస్టిస్ నిస్సార్ అహ్మద్ఖక్రూను అంబుడ్స్మన్గా ఎన్నుకున్నారు. సస్పెన్షన్ను మేము కోర్టులో సవాలు చేయబోతున్నాం.
సివిల్ సమస్యను శాంతిభద్రతల కోణంలో చూడటాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్తాం. అపెక్స్ కౌన్సిల్ను పూర్తిగా రద్దు చేసి.. తిరిగి ఎన్నికలకు వెళ్లేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. సభ్యులందరం రాజీనామా చేస్తాం.. ఈ విషయంలో అజర్కు మేము సవాలు విసురుతున్నాం. ఈనెల 7నుంచి హెచ్సీఏలో క్రికెట్ టోర్నీల నిర్వహణ కోసం ప్రణాళిక రూపొందించాం. కానీ అజర్ ఏకపక్ష వైఖరితో క్రికెటర్ల భవిష్యత్ అగమ్యగోచరంగా తయారైంది. అతని సొంత ప్రయోజనాల కోసం అందరినీ ఇందులోకి లాగుతున్నాడు. ప్రతి అపెక్స్ కౌన్సిల్ సమావేశం అజర్ అన్యాయమంటాడు. వన్మ్యాన్ షోతో హెచ్సీఏలో క్రికెట్ కార్యకలాపాలకు అతను అడ్డుతగులుతున్నాడు. ఇదేనా ప్రజాస్వామ్యం. జస్టిస్ లోధా కమిటీ సిఫారసులకు అనుగుణంగానే క్లబ్లు కలిగి ఉన్నాం. ఈ క్లబ్లతోనే అజర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు. అందరి కంటే క్రికెట్ గొప్పది’ అని అన్నాడు.