FIFA World Cup : ఫిఫా వరల్డ్ కప్లో లియోనల్ మెస్సీ కెప్టెన్సీలో అర్జెంటీనా జట్టు అదరగొడుతోంది. మొదటి మ్యాచ్లో సైదీ అరేబియా చేతిలో ఓటమి నుంచి ఆ జట్టు కోలుకుని అద్భుత ప్రదర్శన చేసింది. క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్ను ఓడించి సెమీస్కు చేరుకుంది. అయితే, శక్రవారం రాత్రి లూసెయిల్ స్టేడియంలో నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్ అనంతరం మెస్సీతో సహా మిగతా సభ్యులు అత్యుత్సాహం ప్రదర్శించారు. డచ్ ఆటగాళ్లు కూడా తగ్గేదేలే అన్నట్టుగా గొడవకు దిగారు. దాంతో ఫిఫా అర్జెంటీనాపై క్రమశిక్షణ చర్యలు మొదలుపెట్టింది. మ్యాచ్లో భద్రత, నియమాలను అర్జెంటీనా జట్టు ఉల్లంఘించింది అని కేసు నమోదు చేసింది. ఈ సంఘటనపై విచారణ చేపట్టనుంది. అయితే ఇరు జట్ల ప్రవర్తనకు సంబంధించి కేసు నమోదు చేశారు. నెదర్లాండ్స్పై కూడా ఆర్టికల్ 12ను ఉల్లంఘించినట్టు కేసు నమోదు చేశారు.
ఈ మ్యాచ్లో అర్జెంటీనా పెనాల్టీ షూట్ రౌండ్లో 4-3 తో నెదర్లాండ్స్ మీద విజయం సాధించింది. అయితే 89వ నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు లియాండ్రో పెరిడిస్ నెదర్లాండ్స్ డిఫెండర్ నాథన్ అకేతో గొడవ పడ్డాడు. బంతిని కోపంతో నెదర్లాండ్స్ డగౌట్ వైపు విసిరేశాడు. దాంతో, ఇరుజట్ల ఆటగాళ్లు, టెక్నికల్ స్టాఫ్ మైదానంలో ఒకరినొకరు తోసుకున్నారు. ఈ మ్యాచ్లో ఇరుజట్ల ఆటగాళ్లకు కలిపి రిఫరీలు 18 ఎల్లో కార్డులు ఇచ్చారు. ఎల్లో కార్డు అందుకున్న జాబితాలో మెస్సీ కూడా ఉన్నాడు. ఫైనల్ బెర్త్కోసం అర్జెంటీనా డిసెంబర్ 14న క్రొయేషియాతో తలపడనుంది. డిసెంబర్ 15వ తేదీన ఫ్రాన్స్, మొరాకో మ్యాచ్లో గెలిచిన జట్టు ఫైనల్కు చేరుతుంది.