లండన్: ఇండియన్ టీమ్ ( Team India ) ఫీల్డింగ్ను మరింత మెరుగుపరిచేందుకు, ఫీల్డర్ల ఏకాగ్రతను పరీక్షించడానికి ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ ఓ వినూత్న ప్రయత్నం చేశాడు. ఇంగ్లండ్తో రెండో టెస్ట్కు ముందు లార్డ్స్లో ప్రాక్టీస్ చేస్తున్న ప్లేయర్స్కు ఓ కొత్త ఫీల్డింగ్ డ్రిల్ ఏర్పాటు చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్ బ్యాటింగ్ చేస్తుండగా.. స్టంప్స్ వెనుక రిషబ్ పంత్ కీపింగ్ చేస్తూ కనిపించాడు. అతని ఏకాగ్రతను పరీక్షించడానికి శ్రీధర్ తనకు రెండు వైపులా ఇద్దరు ప్లేయర్స్ను ఉంచాడు.
బౌలర్ బౌలింగ్ చేస్తుండగా.. ఈ ఇద్దరు ప్లేయర్స్ అటు నుంచి ఇటు బాల్ విసురుతూ క్యాచింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మధ్యలో ఈ బాల్ వల్ల పంత్ తన ఏకాగ్రత కోల్పోకుండా బౌలర్ విసిరిన బంతిని పట్టుకోవాలి. ఈ వినూత్న ఫీల్డింగ్ డ్రిల్ ఎలా ఉంది అంటూ బీసీసీఐ ట్విటర్లో ఆ వీడియో పోస్ట్ చేసింది. ఈ నెల 12 నుంచి ప్రారంభం కాబోయే రెండో టెస్ట్ కోసం టీమిండియా ఇప్పటికే లండన్ చేరుకుంది. క్రికెట్ మక్కా లార్డ్స్లో ఈ మ్యాచ్ జరగనుంది.