ముంబై: ఇండియాలో ఐపీఎల్లో ఆడుతున్న ఆస్ట్రేలియా ప్లేయర్స్ తిరిగి ఇంటికి ఎలా వెళ్లాలన్న ఆందోళనలో ఉన్నట్లు కోల్కతా నైట్రైడర్స్ మెంటార్ డేవిడ్ హస్సీ చెప్పాడు. ప్రస్తుతం ఇండియాలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా సొంత దేశమే తమను రానీయదేమో అన్న ఆందోళన ఐపీఎల్లో ఆడుతున్న ఆసీస్ ప్లేయర్స్లో కనిపిస్తోంది. ఇప్పటికే ఇదే కారణం చెప్పి రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ ఆండ్రూ టై ఇంటికి వెళ్లిపోయాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరులోని ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్సన్ వ్యక్తిగత కారణాలంటూ వెళ్లిపోతున్నారు.
దీనిపైనే డేవిడ్ హస్సీ స్పందించాడు. నిజానికి అందరూ కాస్త ఆందోళనగానే ఉన్నారు. తిరిగి ఆస్ట్రేలియా వెళ్తామా లేదా అన్న సందేహం వాళ్లకు ఉంది. వీళ్లే కాదు మరికొందరు ప్లేయర్స్ పరిస్థితి కూడా ఇదే. మేము బయో బబుల్స్లోనే ఉంటున్నాం. ప్రతి రెండో రోజు కరోనా పరీక్షలు చేస్తారు. నిజానికి అంతా బాగానే చూసుకుంటున్నారు. కానీ ఇండియాలో పరిస్థితి ఎలా ఉందో రోజూ టీవీల్లో చూస్తున్నాం. హాస్పిటల్ బెడ్స్పై పేషెంట్లను చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లోనూ మనం ఇలా ఆడుతూ, అభిమానులకు వినోదాన్ని పంచుతున్నామంటే మేము ఎంత అదృష్టవంతులమో అని మేము నిన్ననే మాట్లాడుకున్నాం అని డేవిడ్ హస్సీ అన్నాడు. కొవిడ్ భయం అందరికీ ఉన్నా.. టోర్నీ కొనసాగాలనే అనుకుంటున్నట్లు అతడు చెప్పాడు.