Virat Kohli: మన దేశంలో అన్ని క్రీడలకంటే పాపులర్ క్రీడ క్రికెట్. స్టార్ క్రికెటర్లను దేవుళ్లలా భావించే అభిమానులున్నారు మన దేశంలో. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన అద్భుతమైన ఆటతీరుతో లక్షలాది మంది అభిమానుల గుండెల్లో చోటు సంపాదించాడు. ఆ లక్షలాది అభిమానుల్లో అమన్ అగర్వాల్ కూడా ఒకడు. విరాట్ కోహ్లీ 71వ సెంచరీ కొట్టేవరకు తాను పెండ్లి చేసుకోనంటూ 2021లో ఓ స్టేడియంలో మ్యాచ్ చూస్తూ అమన్ పోస్టర్ను ప్రదర్శించాడు.
ఆ పోస్టర్ అప్పట్లో వైరల్ అయ్యింది. ఎందుకంటే 2019 నవంబర్లో బంగ్లాదేశ్పై తన 70వ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ ఆ తర్వాత సెంచరీ కోసం చాలాకాలం వేచిచూడాల్సి వచ్చింది. దాంతో అభిమానుల్లో నిరాశ నెలకొన్నది. అమన్ అగర్వాల్ కూడా అలాగే నిరాశ చెంది అంతపెద్ద శపథం చేశాడు. దాంతో అతడు కోహ్లీ సెంచరీతోపాటు, తన పెండ్లి కోసం చాలారోజులు వేచిచూడాల్సి వచ్చింది.
ఎట్టకేలకు 2022 సెప్టెంబర్లో ఆప్ఘనిస్థాన్తో మ్యాచ్లో కోహ్లీ 71వ సెంచరీ చేయడంతో అమన్ అగర్వాల్ శపథం నెరవేరింది. దాంతో అతని పెండ్లికి గ్రీన్ సిగ్నల్ పడింది. కోహ్లీ 71వ సెంచరీ చేయడమే ఆలస్యం అమన్ పెండ్లి చూపులు, పెండ్లి చకచకా జరిగిపోయాయి. ఈ నెల 15న ఆమన్ పెండ్లి చేసుకోగా.. అదేరోజు కోహ్లీ తన 74వ సెంచరీతో అభిమాని అమన్కు కోరినదానికంటే పెద్ద గిఫ్టే ఇచ్చాడు.
అయితే, పెండ్లినాడు కూడా అమన్ తన అభిమాన క్రికెటర్ ఆటను చూడకుండా ఉండలేకపోయాడు. పెండ్లి దుస్తుల్లోనే భారత్ – శ్రీలంక మూడో వన్డే మ్యాచ్ వీక్షించాడు. విరాట్ సెంచరీ చేయడంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఆ సంతోషంతో అప్పట్లో కోహ్లీ 71వ సెంచరీ కోసం పోస్టర్ ప్రదర్శించిన ఫొటోకు, ఇప్పుడు పెండ్లి దుస్తుల్లో మ్యాచ్ చూసిన ఫొటోను జతకలిపి ట్వీట్ చేశాడు. ‘నేను నా అభిమాన క్రికెటర్ను 71వ సెంచరీ అడిగాను. కానీ నాకు ప్రత్యేకమైన రోజున ఆయన 74వ సెంచరీ చేశాడు’ అని ఆ ట్వీట్లో రాశాడు.
“I asked for the 71st century but he scored 74th on my special day” ❤️❤️❤️@imVkohli @AnushkaSharma @StayWrogn pic.twitter.com/zHopZmzKdH
— Aman Agarwal (@Aman2010Aman) January 16, 2023