చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేవాళ్లు మనకు నిత్య జీవితంలో చాలా మందే తారసపడుతుంటారు. ఇక్కడ గుజరాత్ గ్రామస్తులు కూడా అదే చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కు ఉన్న ఆకర్షణ, ఆదరణను చూసిన పలువురు మోసగాళ్లు ‘ఫేక్ ఐపీఎల్’తో రష్యన్లను బురిడీ కొట్టించారు. ఐపీఎల్ వంటి ఐపీఎల్ ను సృష్టించి, క్రికెట్ ను ఆడించి వారికి టోకరా వేశారు.
అసలు విషయంలోకి వెళ్తే.. గుజరాత్ లోని మోహ్సానా జిల్లా మోలిపూర్ గ్రామానికి చెందిన పలువురు యువకులు యూట్యూబ్ లో నకిలీ ఐపీఎల్ మ్యాచులను ప్రసారం చేశారు. స్థానికంగా ఉన్న ఓ వ్యవసాయ క్షేత్రంలో ఓ చిన్నపాటి గ్రౌండ్, పిచ్ ను ఏర్పాటుచేశారు. అక్కడ వ్యవసాయ కూలీలకు, ఊళ్లోని నిరుద్యోగ యువకులకు రోజుకు రూ. 400 ఇచ్చి వాళ్లతో ఆట ఆడించారు. మ్యాచులను షూట్ చేయడానికి 5 హెచ్డీ కెమెరాలను వాడారు.
క్రికెట్ ఆడటానికి వచ్చిన దినసరి కూలీలకు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు ధరించే జెర్సీలు కూడా వేశారు. అదీగాక అంపైర్లకు నకిలీ వాకీటాకీలు ఇచ్చి వాళ్లు డీఆర్ఎస్, రనౌట్ల గురించి చర్చించుకోవడం వంటివి చేయమన్నారు. ఇవన్నీ చేయడానికి వీరికి ప్రత్యేక శిక్షణతో పాటు అప్పటికప్పుడు ఆదేశాలు కూడా అందేవి.
గ్రౌండ్, పిచ్, ఆటగాళ్లు అంతా రెడీ. సరే.. మరి అభిమానులు ఏరి..? మ్యాచ్ లో హంగులేవి..? కామెంటేటర్లు ఏరి..? అనేగా మీ డౌటానుమానం. మనసుంటే మార్గముండదా ఏమి..? లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి యూట్యూబ్ లైవ్ లో ప్రేక్షకులు అరిచినట్టు.. ఫోర్, సిక్సర్ కొట్టినప్పుడు స్టేడియం అంతా హోరెత్తినట్టు ‘మాయ’ (దుబాయ్ లో నిర్వహించిన 2020 ఐపీఎల్ లో ప్రేక్షకులు లేకున్నా స్టేడియం అంతా హోరెత్తించిన టెక్నాలజీ వాడారు చూడండి.. అలాంటిది) చేశారు. ఇక కామెంటేటర్ విషయానికొస్తే ప్రఖ్యాత క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే లా మాట్లాడే ఓ మిమిక్రీ ఆర్టిస్టును పిలిపించి కామెంట్రీ చెప్పించారు.
ఇన్ని హంగులను సమకూర్చిన ఫేక్ ఐపీఎల్ నిర్వాహకులు.. రష్యాలో ఉన్న బెట్టింగ్ వీరులు మ్యాచులు చూసేందుకు లైవ్ మ్యాచులు ప్రసారం చేసేవాళ్లు. బెట్టింగ్ చేసేందుకు వీలుగా టెలిగ్రామ్ లింకులు పెట్టేవాళ్లు. ఇదంతా చూసిన పాపం రష్యా బెట్టింగ్ వీరులు.. చెన్నై, ముంబై, గుజరాత్ ఫ్రాంచైజీల మీద బెట్టింగులు కాసేవారు.
ఈ మొత్తం తతంగాన్ని నడిపించిన వ్యక్తి షోయభ్ దేవ్డా.. రష్యాలోని ఫేమస్ పబ్ లకు వెళ్తూ అక్కడ ఈ ఐపీఎల్ గురించి.. బెట్టింగ్ గురించి వాళ్లను నమ్మించాడు. క్రికెట్ మీద అంతగా అవగాహన లేని రష్యన్లు దేవ్డా ను నమ్మి బెట్టింగ్ వేశారు. ఇలా మొదటి ఇన్స్టాల్మెంట్ రూపంలో రష్యన్ బెట్టింగ్ రాయుళ్లలో ఒక్కొక్కరి నుంచి రూ. 3 లక్షల దాకా వసూలు చేశారట నిర్వాహకులు. ఈ ఫేక్ ఐపీఎల్ ముచ్చట ఆనోటా ఈనోటా పాకి సైబర్ క్రైం పోలీసుల కంట పడింది. వాళ్లు మోహ్సానా పోలీసులకు సమాచారం అందివ్వగా.. ఈ ఫేక్ ఐపీఎల్ తో పాటు నకిలీ ఛానెల్ ను నడిపిస్తున్న నలుగురు కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
పక్కా ప్లాన్ తో మూడు వారాలుగా గుజరాత్ లో జరుగుతున్న ఈ ఫేక్ ఐపీఎల్ టోర్నీలో ఇంకో విశేషం కూడా ఉందండోయ్.. ప్రస్తుతం ఇది గ్రూప్ స్టేజ్ దాటి క్వార్టర్స్ కు చేరుకుంది. ఇంతలోనే పోలీసుల కంటపడ్డారు గానీ లేకుంటే ఫైనల్ మ్యాచ్ ను గుజరాత్ లో ఇటీవలే ముగిసిన రాజస్తాన్ రాయల్స్-గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ కంటే ఘనంగా ప్లాన్ చేసేవాళ్లేమో ఈ ఫేక్ ఐపీఎల్ నిర్వాహకులు.