PV Sindhu : దుబాయ్పై ఇరాన్ క్షిపణి దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ దాడుల ప్రభావం దుబాయ్లో చిక్కుకుపోయిన పలువురు భారతీయులపై కూడా ఉంది. భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కూడా దుబాయ్లో చిక్కుకున్నారు. అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా, భయంగా ఉందని సింధు వెల్లడించారు. సింధు ప్రస్తుతం దుబాయ్ ఎయిర్పోర్టులో చిక్కుకుపోయారు.
ఆల్ ఇంగ్లండ్ ఓపెన్లో పాల్గొనేందుకు ఆమె దుబాయ్ మీదుగా బర్మింగ్హమ్ వెళ్తున్నారు. అయితే, దుబాయ్ చేరుకున్న తర్వాత యుద్ధం కారణంగా విమనాలు రద్దు కావడంతో ఆమె, తన కోచ్, బృందంతో కలిసి అక్కడే ఉండాల్సి వచ్చింది. ఈ మేరకు తన సోషల్ మీడియా ద్వారా దుబాయ్లోని పరిస్థితిని వివరించారు. ‘‘దుబాయ్లో పరిస్థితి కఠినంగా ఉంది. గంటగంటకూ మరింత ఆందోళనకరంగా మారుతోంది. ఎయిర్పోర్టులో మేం ఉన్న ప్రదేశానికి దగ్గర్లో కొద్దిసేపటి క్రితం పేలుడు జరిగింది. మేం, కోచ్తో సహా అక్కడి నుంచి పరుగులు తీశాం. కోచ్కు దగ్గర్లో పేలుడు వ్యర్థాలు పడగా, పొగ కమ్ముకుంది. ఇది మాకు చాల భయంకరమైన, ఆందోళనకరమైన పరిస్తితి. తాము, తన బృందం అంతా సురక్షితంగా ఉన్నాం. అధికారులు మమ్మల్ని ఎయిర్పోర్టులోని సురక్షిత ప్రదేశానికి తరలించారు.
ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో ఇంత వేగంగా స్పందించిన అధికారులకు, రాయబార కార్యాలయానికి ధన్యవాదాలు. ప్రస్తుతానికి మేం కాస్త విశ్రాంతి తీసుకుని పరిస్థితులు చక్కబడేవరకు ఎదురుచూస్తాం’’ అని సింధు పేర్కొన్నారు. దీనికి ముందు సింధు తన సోషల్ మీడియా ఖాతాలో అక్కడి కొన్ని విజువల్స్ షేర్ చేశారు. సింధు పాల్గొనాల్సిన టోర్నీ మంగళవారం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. దుబాయ్ ఎయిర్పోర్టుపై కూడా ఇరాన్ దాడి చేసిన నేపథ్యంలో అక్కడి ఎయిర్పోర్టులో సేవలు నిలిచిపోయాయి. విమానాలు రద్దయ్యాయి.