సిల్హెట్: మహిళల ఆసియాకప్లో ఇప్పటికే సెమీఫైనల్కు అర్హత సాధించిన భారత జట్టు.. సోమవారం థాయ్లాండ్తో అమీతుమీకి సిద్ధమైంది. టోర్నీ ఆరంభంలో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసుకున్న హర్మన్ప్రీత్ బృందం.. దాయాది పాకిస్థాన్ చేతిలో ఓడినా.. ఆ తర్వాత బంగ్లాదేశ్తో పోరులో ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. వచ్చే ఏడాది జరుగనున్న టీ20 ప్రపంచకప్ను దృష్టిలో పెట్టుకొని ఈ మ్యాచ్లోనూ ప్రయోగాలు చేసేందుకు టీమ్ఇండియా సిద్ధమైంది. ఓపెనర్లు స్మృతి మందన, షెఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్తో భారత బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. గాయంతో గత మ్యాచ్లో విశ్రాంతి తీసుకున్న హర్మన్ప్రీత్ కౌర్ బరిలోకి దిగితే బ్యాటింగ్ మరింత బలోపేతం కానుంది. మరోవైపు గత మూడు మ్యాచ్ల్లో విజయాలతో థాయ్లాండ్ ఆత్మవిశ్వాసంతో ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న థాయ్లాండ్ సెమీస్ బెర్త్ ఖరారు చేసేందుకు శక్తివంచన లేకుండా పోరాడనుంది. మరోవైపు ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్ల్లో పాకిస్థాన్ 71 పరుగుల తేడాతో యూఏఈపై.. థాయ్లాండ్ 50 పరుగుల తేడాతో మలేషియాపై గెలుపొందాయి.