IPL 2024 : ప్రపంచంలోనే మెగా టీ20 లీగ్ అయిన ఐపీఎల్(IPL) మరో సీజన్కు సిద్ధమవుతోంది. మార్చిలో 17వ సీజన్ నిర్వహించేందుకు బీసీసీఐ(BCCI), ఐపీఎల్ పాలకమండలి కసరత్తులు చేస్తోంది. ఈ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) డిఫెండింగ్ చాంపియన్గా అడుగుపెట్టనుంది. ఇప్పటికే ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలెట్టాడు. 2024 ఎడిషన్లో సీఎస్కేకు కొత్త కంపెనీ స్పాన్సర్గా వ్యవహరించనుంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు చెందిన ఎతిహద్ ఎయిర్వేస్(Etihad Airways) కంపెనీతో గురువారం చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్తో ఒప్పందం చేసుకుంది. అనంతరం ఇరువర్గాల ప్రతినిధులు కొత్త జెర్సీలతో ఫొటోలకు పోజిచ్చారు. క్రికెట్ స్పాన్సర్గా భారతీయులకు మరింత చేరువకావాలనుకుంటున్న ఎతిహద్ ఎయిర్వేస్.. అంబాసిడర్గా బాలీవుడ్ నటి కత్రినా కైఫ్(Katrina Kaif) పేరును పరిశీలిస్తోంది.
పదిహేడో సీజన్లో ధోనీ సేన ఎతిహద్ ఎయిర్వేస్ లోగో ఉన్న జెర్సీతో బరిలోకి దిగనుంది. అంతేకాదు సీఎస్కే ఈవెంట్స్తో పాటు ఇతర టీ20 లీగ్స్లో కూడా ఎతిహద్ స్పాన్సర్గా కొనసాగనుంది. ‘ఈరోజు మేము సీఎస్కేతో ఒప్పందం చేసుకున్నాం. భారత్లో క్రికెట్ అంతర్భాగం. సీఎస్కేతో మా బంధం మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నాం’ అని ఎతిహద్ ఎయిర్వేస్ చీఫ్ రెవెన్యూ ఆఫీసర్ అరిక్ డే వెల్లడించాడు.
ఐపీఎల్ ట్రోఫీతో ధోనీ, జడేజా
ఐపీఎల్ 17వ సీజన్ షెడ్యూల్ అధికారికంగా విడుదల కాలేదు. అయితే.. మార్చి 23 నుంచి టోర్నీ షురూ కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. నిరుడు అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్లో ధోనీ సేన గుజరాత్ టైటాన్స్పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఐదోసారి చాంపియన్గా అవతరించి ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేసింది. 2023 ఎడిషన్లో టీవీఎస్ యూరో గ్రిప్ కంపెనీ సీఎస్కే జెర్సీ స్పాన్సర్గా వ్యవహరిచింది.