న్యూఢిల్లీ : పారిస్ ఒలింపిక్స్లో ఎదురైన చేదు అనుభవం తనను మానసికంగా ఎంతో బలోపేతం చేసిందని, అదే మ్యూనిచ్ వరల్డ్ కప్లో సంచలన విజయానికి పునాదిగా నిలిచిందని భారత స్టార్ షూటర్, హైదరాబాదీ ఇషా సింగ్ పేర్కొంది. గత వారం మ్యూనిచ్లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్ మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో 43 పాయింట్ల ప్రపంచ రికార్డు స్కోరుతో ఇషా పసిడి పతకాన్ని ముద్దాడింది. ఆపై 10 మీ. పిస్టల్ ఈవెంట్లోనూ రజతం నెగ్గి టోర్నీలో భారత్ అగ్రస్థానంలో నిలిచేలా చేసింది. ఒలింపిక్స్లో తీవ్రంగా నిరాశపరిచిన ఇషా ఆ తర్వాత ఎదురైన వైఫల్యాల వల్ల చాలా మానసిక సంఘర్షణకు లోనయ్యానని చెప్పింది.
అయితే క్రీడల్లో అత్యున్నత వేదికను చూసేసిన తర్వాత మిగతా పోటీల ఒత్తిడిని తట్టుకోవడం సులువైందని, తనలో సరికొత్త పట్టుదల పెరిగిందని వెల్లడించింది. ‘షూటింగ్లో ఆఖరి షాట్ పడేవరకు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు.అందుకే మ్యూనిచ్ బరిలో ఎక్కడా అలసత్వానికి తావివ్వకుండా చివరి క్షణం వరకు పట్టుదలతో పోరాడాను. పదేళ్ల కెరీర్ అనుభవంతో ఒత్తిడిని జయించడం నాకు అలవాటైంది. పరాజయాలను నేను ఆడుకునే లెగో బ్లాక్స్ లాగా భావిస్తాను. అవి మనల్ని మరింత ఎత్తుకు ఎదగడానికి తోడ్పడతాయి’ అని ఇషా చెప్పింది.