గ్రెనడా: గత రెండు మ్యాచ్ల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన ఇంగ్లండ్ జట్టు.. తప్పక నెగ్గాల్సిన మ్యాచ్లో విజృంభించింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్ను చిత్తుచేసింది. దీంతో ఇంగ్లిష్ సిరీస్లో 1-2తో నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (45 బంతుల్లో 82; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) దంచికొట్టాడు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కరన్, ఆదిల్ రషీద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో ఇంగ్లండ్ 19.5 ఓవర్లలో 3 వికెట్లకు 226 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (56 బంతుల్లో 109 నాటౌట్; 4 ఫోర్లు, 9 సిక్సర్లు) అజేయ సెంచరీతో ఆకట్టుకోగా.. ఆఖర్లో లియామ్ లివింగ్స్టోన్ (30; 3 సిక్సర్లు), హ్యారీ బ్రూక్ (7 బంతుల్లో 31; ఒక ఫోర్, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. చివరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 21 పరుగులు అవసరం కాగా.. రస్సెల్ బౌలింగ్లో బ్రూక్ వరుసగా 4,6,6,2,6 కొట్టి జట్టును గెలిపించాడు.