గతేడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) సీజన్లో పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) 14వ సీజన్లో మాత్రం ఆల్రౌండ్షోతో అదరగొట్టింది. ఐపీఎల్ 2021 సీజన్ నిరవధికంగా వాయిదా పడటానికి ముందు చెన్నై ఆడిన 7 మ్యాచ్ల్లో ఐదు విజయాలతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ధోనీసేన ప్రదర్శనపై ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.
మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై టీమ్కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు. ఆ జాబితాలో పలువురు క్రికెటర్లు కూడా ఉన్నారు. సీఎస్కే తన అభిమానికి జెర్సీని గిఫ్ట్గా పంపి సర్ప్రైజ్ చేసింది. ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ కేట్ క్రాస్ చెన్నై ఫ్రాంఛైజీ నుంచి ప్రత్యేక బహుమతిని అందుకున్నది. చెన్నై టీమ్పై అభిమానం చూపించే కేట్ తనకు పంపిన చెన్నై జెర్సీని ధరించి కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా జెర్సీతో దిగిన ఫొటోను సోషల్మీడియాలో పోస్ట్ చేసింది.