అహ్మదాబాద్: నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియాతో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి రోజు ఆటలో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్.. ఆన్ఫీల్డ్ అంపైర్ నితిన్తో వాదించడం కనిపించే ఉంటుంది. థర్డ్ అంపైర్ షంషుద్దీన్ తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే దీనిపై ఇంగ్లండ్ టీమ్ ఇప్పుడు రిఫరీ జవగళ్ శ్రీనాథ్కు ఫిర్యాదు చేసింది. థర్డ్ అంపైర్ నిర్ణయాలు స్థిరంగా ఉండాలని ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్, కోచ్ సిల్వర్వుడ్ రిఫరీని కోరారు. ఆతిథ్య జట్టుకు అనుకూలంగా వచ్చిన నిర్ణయాలు కొన్నింటిని థర్డ్ అంపైర్ తొందరపడి తీసుకున్నట్లుగా ఉన్నాయని వాళ్లు ఫిర్యాదు చేశారు.
ఏం జరిగింది?
తొలి రోజు ఆటలో శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ విషయంలో మూడో అంపైర్ తీసుకున్న నిర్ణయాలపై ఇంగ్లండ్ టీమ్ అసంతృప్తిగా ఉంది. మొదట శుభ్మన్ గిల్ ఇచ్చిన క్యాచ్ను స్లిప్లో బెన్ స్టోక్స్ అందుకున్నాడు. అయితే అది మొదట గ్రౌండ్ను టచ్ అయినట్లు భావించిన మూడో అంపైర్ షంషుద్దీన్ నాటౌట్గా ప్రకటించాడు. మరో కెమెరా యాంగిల్ చూడకుండానే తొందరపడి మూడో అంపైర్ నాటౌట్గా ప్రకటించాడని ఇంగ్లండ్ వాదిస్తోంది. ఆ తర్వాత రోహిత్ శర్మ స్టంపౌట్ విషయంలోనూ ఇలాగే మూడో అంపైర్ అన్ని కెమెరా యాంగిల్స్ చూడకుండా నిర్ణయం తీసుకున్నట్లు ఆ టీమ్ ఆరోపిస్తోంది. ఆ సమయంలో ఒకే యాంగిల్లోనే ఎందుకు చూస్తున్నారు అని ఆన్ఫీల్డ్ అంపైర్ను రూట్ ప్రశ్నించడం స్టంప్ మైక్లో రికార్డయింది. అదే ఇంగ్లండ్ బ్యాటింగ్ చేసే సమయంలో జాక్ లీచ్ క్యాచ్పై సందిగ్ధంలో ఉన్నప్పుడు మూడో అంపైర్ అన్ని కెమెరా యాంగిల్స్ పరిశీలించి నిర్ణయం తీసుకున్నట్లు ఇంగ్లండ్ చెబుతోంది. దీంతో కెప్టెన్, కోచ్ రిఫరీని కలిసి ఫిర్యాదు చేసినట్లు ఇంగ్లండ్ టీమ్ అధికార ప్రతినిధి వెల్లడించారు. దీనిపై ఐసీసీ స్పందించలేదు.
షంషుద్దీన్తో గతంలోనూ..
ఇప్పుడు మూడో అంపైర్గా ఉన్న షంషుద్దీన్తో ఇంగ్లండ్ గతంలోనూ అసంతృప్తి వ్యక్తం చేసింది. 2017లో ఓ టీ20 సందర్భంగా కెప్టెన్గా ఉన్న ఇయాన్ మోర్గాన్.. షంషుద్దీన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇప్పుడు కూడా అతని నిర్ణయాలపై టీమ్ అసంతృప్తిగా ఉన్నట్లు ఆ టీమ్ ప్లేయర్ జాక్ క్రాలీ స్పష్టం చేశాడు. కరోనా కారణంగా ఈ సిరీస్లో తటస్థ అంపైర్ లేకుండా ముగ్గురు ఇండియన్ అంపైర్లనే ఐసీసీ నియమించిన విషయం తెలిసిందే.