లండన్: ఆస్ట్రేలియాను కరోనా వణికిస్తున్న వేళ అక్కడ కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆసీస్ గడ్డపై జరగబోయే యాషెస్ సిరీస్( Ashes Series )ను ఎగ్గొట్టే ప్లాన్లో ఉంది ఇంగ్లండ్ టీమ్. ఆ టీమ్లోని సీనియర్ ప్లేయర్స్ అన్ని రోజుల పాటు క్వారంటైన్ తమ వల్ల కాదని తేల్చేశారు. సిరీస్ను వాయిదా వేయాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే సిరీస్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయడం కుదరదని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్లేయర్స్కు తేల్చి చెబుతున్నట్లు ఈఎస్పీఎన్ క్రికిన్ఫో రిపోర్ట్ వెల్లడించింది. దీంతో సెకండ్ రేట్ టీమ్ను పంపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మూకుమ్మడిగా బాయ్కాట్
ఇంగ్లండ్ టీమ్లోని కొందరు ప్లేయర్స్ ఏకంగా నాలుగు నెలల (ఐపీఎల్, టీ20 వరల్డ్కప్, యాషెస్) పాటు దూరంగా ఉండాల్సి వస్తోంది. అన్ని రోజుల పాటు తమ కుటుంబాలతో సహా హోటల్ గదులకే పరిమితం కావడం తమ వల్ల కాదని ప్లేయర్స్ అంటున్నారు. ఇదే విషయాన్ని ఈసీబీకి చెప్పి యాషెస్ సిరీస్ను వాయిదా వేయాలని కోరారు. అయితే ఈసీబీ మాత్రం సిరీస్ వాయిదాకు ససేమిరా అనడంతో ప్లేయర్స్, సపోర్టింగ్ స్టాఫ్ అంతా కలిసి మూకుమ్మడిగా సిరీస్ను బాయ్కాట్ చేయాలన్న నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అదే జరిగితే సీనియర్ ప్లేయర్స్ను కాదని సెకండ్ రేట్ టీమ్ను కూడా ఈసీబీ యాషెస్ కోసం పంపే చాన్స్ ఉంది. స్టువర్డ్ బ్రాడ్లాంటి సీనియర్ ప్లేయర్ను కెప్టెన్గా నియమించవచ్చు. ఆస్ట్రేలియాలో కఠిన క్వారంటైన్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. ప్లేయర్స్ పూర్తిగా హోటల్ రూమ్స్కే పరిమితం కావాలని క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది. గోల్డ్ కోస్ట్లోని రిసార్ట్ హోటల్లో ప్లేయర్స్ గడపడానికి అవకాశం ఇవ్వొచ్చని వార్తలు వచ్చినా.. తాజాగా ఆ చాన్స్ లేదని, కేవలం ట్రైనింగ్ కోసం మాత్రమే రెండు, మూడు గంటలపాటు హోటల్ రూమ్స్ నుంచి బయటకు రావడానికి అనుమతి ఇస్తున్నారని తెలిసింది. ఇంత కఠినమైన బబుల్పై ప్లేయర్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.