ధర్మశాలలో భారత్ దుమ్మురేపుతున్నది. సిరీస్ను 4-1తో కైవసం చేసుకోవాలన్న కసితో ఉన్న టీమ్ఇండియా..ఇంగ్లండ్పై ఆధిపత్యం చెలాయిస్తున్నది. హిమాలయ పర్వత సానువుల్లో గురువారం మొదలైన ఆఖరిదైన ఐదో టెస్టులో ఇంగ్లండ్ భరతం పట్టింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన స్టోక్స్సేనను కుల్దీప్యాదవ్, అశ్విన్ స్పిన్ తంత్రంతో కుప్పకూల్చారు. ఫ్లాట్పిచ్పై బంతిని గింగిరాలు తిప్పుతూ ఇంగ్లిష్ బ్యాటర్లను ఔట్ చేశారు. బంతి ముట్టుకుంటే మసే అన్న రీతిలో కుల్దీప్ చెలరేగగా, వందో టెస్టు ఆడుతున్న అశ్విన్ తన అనుభవాన్ని రంగరించి ఆఖరి వరుస బ్యాటర్ల పనిపట్టాడు. ఫలితంగా 218 పరుగులకే పరిమితమైన ఇంగ్లండ్.. బౌలింగ్లోనూ పేలవ ప్రదర్శన కనబరిచింది. యశస్వి జైస్వాల్, రోహిత్శర్మ అర్ధసెంచరీలతో భారత్ మెరుగైన స్థితిలో ఉంది.
Dharamshala Test | ధర్మశాల: భారత్, ఇంగ్లండ్ మధ్య గురువారం మొదలైన ఐదో టెస్టు ఆసక్తికరంగా సాగుతున్నది. హిమాలయ పర్వత శ్రేణువుల్లో చలిగాలుల మధ్య రెండు జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. సిరీస్ ఇప్పటికే ఖాతాలో వేసుకున్న రోహిత్సేన ఆధిక్యంపై కన్నేస్తే..మరోవైపు ఆఖరి పోరులోనైనా పరువు నిలుపుకునేందుకు ఇంగ్లండ్ ప్రాకులాడుతున్నది. తొలుత టాస్ గెలిచి రెండో ఆలోచన లేకుండా బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్..మూల్యం చెల్లించుకుంది.
ఫ్లాట్పిచ్పై భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ భారీ స్కోరు సాధిద్దామనుకున్న ఇంగ్లండ్కు సీన్ రివర్స్ అయ్యింది. ఇంగ్లిష్ జట్టు విఫలమైన చోట భారత బ్యాటర్లు ఇరుగదీశారు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్(57), రోహిత్శర్మ(52 నాటౌట్) అర్ధసెంచరీలతో కదంతొక్కగా, శుభ్మన్ గిల్(26 నాటౌట్) ఆకట్టుకున్నాడు. వీరి రాణింపుతో భారత్ తొలి ఇన్నింగ్స్లో 135-1 స్కోరు చేసింది. చేతిలో 9 వికెట్లు ఉన్న టీమ్ఇండియా ప్రస్తుతం 83 పరుగుల దూరంలో ఉంది.
షోయబ్ బషీర్ (1-64) ఒక వికెట్ దక్కించుకున్నాడు. అంతకముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 218 పరుగులకు పరిమితమైంది. ఓపెనర్ జాక్ క్రాలీ (79) అర్ధసెంచరీ మినహా అందరూ స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు. కుల్దీప్యాదవ్(5-72), అశ్విన్ ( 4-51) విజృంభించారు. ముఖ్యంగా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్..ఇంగ్లండ్ పతనంలో కీలకమయ్యాడు. ఈ మ్యాచ్ ద్వారా యువ క్రికెటర్ దేవదత్ పడిక్కల్..టీమ్ఇండియా తరఫున అరంగేట్రం చేశాడు. ధర్మశాల పోరుతో అశ్విన్, బెయిర్స్టో వంద టెస్టు మ్యాచ్ల క్లబ్లో చేరారు.
కుల్దీప్ విజృంభణ:
టాస్ నెగ్గి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్కు ఒకింత మెరుగైన శుభారంభమే దక్కింది. ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్ డకెట్ దూకుడుగా ఆడారు. ఈ క్రమంలో పేసర్లు బుమ్రా, సిరాజ్ను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టారు. అయితే బౌలింగ్ మార్పుగా వచ్చిన కుల్దీప్యాదవ్.. ఇంగ్లండ్ వికెట్ల వేటకు తెరతీశాడు. తొలుత డకెట్(27)ను..శుభమన్ గిల్ సూపర్ క్యాచ్ ద్వారా పెవిలియన్ పంపాడు. కుల్దీప్ బంతిని షాట్ ఆడబోయిన డకెట్..గిల్ వెనుకకు పరిగెడుతూ పట్టిన క్యాచ్ మ్యాచ్కే హైలెట్గా నిలిచింది. 36 పరుగుల తేడాతో ఒలీపోప్(11) ఔటయ్యాడు. కుల్దీప్ విసిరిన ఊరించే బంతిని ఆడే క్రమంలో పోప్..స్టంప్ ఔట్ అయ్యాడు. ఓవైపు సహచరులు ఔట్ అవుతున్నా..దూకుడు తగ్గించని క్రాలేను కుల్దీప్ బోల్తా కొట్టించాడు. తన అమ్ములపొదిలోని గూగ్లీని సంధిస్తూ క్రాలీని క్లీన్బౌల్డ్ చేశాడు. దీంతో 137 పరుగులకే ముగ్గురు టాపార్డర్ బ్యాటర్లు పెవిలియన్ చేరారు. ఇక్కణ్నుంచి మరింత జోరు పెంచిన కుల్దీప్యాదవ్..బెయిర్స్టో(29),
కెప్టెన్ బెన్ స్టోక్స్(0)ను ఔట్ చేస్తే..రూట్(26)ను జడేజా సాగనంపాడు. దీంతో 175 పరుగుల స్కోరు వద్ద ఇంగ్లండ్ మూడు కీలక వికెట్లు చేజార్చుకుని పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. వందో టెస్టు ఆడుతున్న బెయిర్స్టో..కీపర్ జురెల్ క్యాచ్తో ఔట్ కాగా, స్టోక్స్ వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. టాపార్డర్ను కుల్దీప్ దెబ్బతీస్తే..లోయార్డర్ను అశ్విన్ పనిపట్టాడు. టామ్ హార్ట్లే(6), మార్క్వుడ్(0), బెన్ ఫోక్స్(24), అండర్సన్(5) వరుస విరామాల్లో అశ్విన్ పెవిలియన్ పంపాడు. మొత్తంగా 81 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చివరి ఏడు వికెట్లు కోల్పోయింది.
భారత్ దూకుడుగా:
ఇంగ్లండ్ తడబడ్డ చోట భారత బ్యాటర్లు సాధికారికంగా ఇన్నింగ్స్తో రాణించారు. సిరీస్లో సూపర్ఫామ్మీదున్న యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, కెప్టెన్ రోహిత్శర్మ జట్టుకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరు ఇంగ్లండ్ బౌలర్లను అవలీలగా ఎదుర్కొంటూ స్కోరుబోర్డును పరిగెత్తించారు. ముఖ్యంగా జైస్వాల్..ఇంగ్లిష్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. స్పిన్నర్ షోయబ్ బషీర్ను లక్ష్యంగా చేసుకుంటూ జైస్వాల్ మూడు కండ్లు చెదిరే సిక్స్లతో ఆకట్టుకున్నాడు. మరో ఎండ్లో 151కి.మీ వేగంతో మార్క్ వుడ్ విసిరిన బంతిని అంతే వేగంతో రోహిత్..సిక్స్గా మలిచి వారెవ్వా అనిపించుకున్నాడు.
ఇలా ఇద్దరు బౌండరీలు అవలీలగా బాదుతూ స్కోరుబోర్డుకు కీలక పరుగులు జతచేశారు. ఇన్నింగ్స్ జోరందుకుంటున్న తరుణంలో బషీర్ బౌలింగ్లో వరుసగా రెండు బౌండరీలు బాదిన జైస్వాల్..స్టంప్ ఔట్గా వెనుదిరిగాడు. దీంతో తొలి వికెట్కు 104 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన గిల్(26 నాటౌట్).. రోహిత్కు జతకలిశాడు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డ వీరిద్దరు 135-1 వద్ద తొలిరోజును ముగించారు. ఈ క్రమంలో రోహిత్ అర్ధసెంచరీ మార్క్ అందుకున్నాడు.
2 ఒక టెస్టు సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్గా యశస్విజైస్వాల్ (712) నిలిచాడు. మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ (774, 732) రెండుసార్లు ఈ ఫీట్ అందుకున్నాడు.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 218 ఆలౌట్ (క్రాలే 79, బెయిర్స్టో 29, కుల్దీప్యాదవ్ 5-72, అశ్విన్ 4-51), భారత్ తొలి ఇన్నింగ్స్: 135-1(జైస్వాల్ 57, రోహిత్ 52 నాటౌట్, బషీర్ 1-64)