టెస్టుల్లో తనదైన ముద్ర వేసిన టీమిండియా కోచ్గా రవిశాస్త్రికి పేరుంది. గతేడాది ఈ పదవి నుంచి తప్పుకున్న రవిశాస్త్రి మరోసారి కామెంటరీ బాక్సులో అదరగొడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇంగ్లండ్, భారత్ మధ్య జరిగిన టెస్టు సమయంలో కామెంటరీ బాక్సులో ఉన్న రవిశాస్త్రి.. రెండో ఇన్నింగ్స్లో భారత జట్టు ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
‘‘భారత్ ఆటతీరు చాలా డిసప్పాయింటింగ్గా ఉంది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ను పోటీ నుంచి తప్పించే అవకాశం వాళ్ల దగ్గర ఉంది. నాలుగో రోజు కనీసం రెండు సెషన్లు బ్యాటింగ్ చేస్తే సరిపోయేది. కానీ బ్యాటర్లు చాలా డిఫెన్సివ్గా, బెరుకుగా కనిపించారు. ముఖ్యంగా లంచ్ తర్వాత భారత ఆటగాళ్లు మరీ ఇబ్బందిగా ఉన్నారు.
వికెట్లు పోయినా ఛాన్సులు తీసుకొని పరుగులు చేయాల్సింది. ఆ సమయంలో పరుగులే ముఖ్యం. కానీ వాళ్లు ఒక చట్రంలో ఇరుక్కుపోయి వెంట వెంటనే వికెట్లు కోల్పోయారు. ఇంగ్లండ్కు ఈ రోజు సాధ్యమైనంత బ్యాటింగ్ చేసే అవకాశం కల్పించారు’’ అని రవిశాస్త్రి విమర్శించాడు.
అదే బాక్సులో కామెంటరీ చెప్తున్న ఇంగ్లండ్ గ్రేట్ కెవిన్ పీటర్సన్ మాట్లాడుతూ.. బుమ్రా వ్యూహాలు సరిగా లేవని, తను ఈ మాట బుమ్రాను తక్కువ చేయడానికి చెప్పడం లేదని, అతనిపై ఎంతో గౌరవంతోనే చెప్తున్నానని అన్నాడు. రివర్స్ స్వింగ్ అవుతున్న సమయంలో బ్యాటర్కు సులభంగా పరుగులు రాకుండా అడ్డుకోవాలని, కానీ ఇంగ్లండ్ బ్యాటర్లకు ఆ విషయంలో అసలు సమస్యే రాలేదని చెప్పాడు. కాగా, ఈ మ్యాచ్లో ఏడు వికెట్లతో భారీ విజయం సాధించిన ఇంగ్లండ్.. ఐదు టెస్టుల సిరీస్ను 2-2తో సమం చేసింది.