క్రికెట్ పుట్టినిల్లు అయిన ఇంగ్లాండ్ లో Lords స్టేడియానికి ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. England జట్టుకు ఉన్న అభిమానుల కంటే లార్డ్స్ స్టేడియానికి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది క్రికెట్ అభిమానులు ఉన్నారని చెప్పడం అతిశయోక్తి కాదు. ప్రపంచంలో ప్రొఫెషనల్ క్రికెట్ ఆడే ఏ క్రికెటర్ అయినా తన జీవితంలో కనీసం ఒక్కసారైనా అక్కడ మ్యాచ్ ఆడాలని, తానెంటో నిరూపించుకోవాలని అనుకుంటాడు. అంతటి ఘనత వహించిన లార్డ్స్ కు ఈసీబీ తీసుకున్న చర్య వల్ల తీవ్ర అవమానం జరిగింది.
లార్డ్స్ లో జరిగేది టెస్టు, వన్డే, టీ20 అనే తేడా లేకుండా ఎప్పుడూ నిండుగా ఉండే స్టేడియంలో గురువారం (జూన్ 2) నుంచి ప్రారంభం కాబోయే Eng vs NZ తొలి టెస్టు కోసం కనీసం సగం కంటే ఎక్కువ సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి. టెలిగ్రాఫ్ కథనం ప్రకారం.. లార్డ్స్ టెస్టు తొలి నాలుగు రోజులకు సుమారు 20 వేల టికెట్లు మిగిలిపోయాయట. దీనికి కారణం ఈసీబీ టికెట్ రేట్లను ఎకాఎకిన పెంచడమే అంటున్నారు. ఒక టికెట్ పై సుమారు 100 పౌండ్ల నుంచి 160 పౌండ్ల వరకు రేట్లు పెంచడం వల్లే టికెట్లను కొనడానికి జనం ఆసక్తి చూపడం లేదట. దీంతో తొలి రోజుకు 1,800 టికెట్లు, రెండో రోజుకు 2,500.. మూడో రోజుకు 4,600.. నాలుగో రోజుకు 9,600 టికెట్లు ఖాళీగానే ఉన్నాయని సమాచారం.
ఇంగ్లాండ్-న్యూజిలాండ్ ల మధ్య జరుగనున్న తొలి టెస్టుకు ఇంగ్లీష్ జట్టు కొత్త కోచ్ (మెక్ కల్లమ్), కొత్త కెప్టెన్ (బెన్ స్టోక్స్) తో బరిలోకి దిగుతున్నది. అదీగాక గతేడాది కివీస్ జట్టు.. ఇంగ్లాండ్ ను వారి స్వదేశంలోనే ఓడించింది. దానికి ఇప్పుడు బదులు తీర్చుకోవాలని స్టోక్స్ సేన భావిస్తున్నది. దీంతోపాటు కొత్త కోచ్, కెప్టెన్ ల తో కూడిన జట్టు ఏ విధంగా ఆడుతుందో చూద్దామని కూడా అభిమానులలో కుతుహలం పెరిగింది. అయితే ఈసీబీ తాజా చర్యతో ఇంగ్లాండ్ కు ప్రేక్షకుల నుంచి తగిన మద్దతు కూడా లభించడం కష్టంగానే ఉంది. పెంచిన టికెట్ రేట్ల కారణంగా అభిమానులు కూడా అంతంత రేట్లు పెట్టి స్టేడియానికి వెళ్లి చూసే బదులు ఇంట్లో చూస్తే అయిపోతుంది కదా.. అనే భావనలో ఉన్నారు.
ఇదే విషయమై ఇంగ్లాండ్ మాజీ సారథి Michael Vaugh ట్విటర్ వేదికగా స్పందించాడు. ‘ఈ వారం Lords stadium నిండటం లేదన్న వార్తలు వినడానికి ఇబ్బందిగా ఉన్నాయి. టికెట్ రేట్ల పెంపు వల్లే ఇలా జరిగిఉంటుందని నా అభిప్రాయం. రేట్లను అంతెందుకు పెంచారు..? ఇప్పుడు ఇంగ్లాండ్ లో సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి. పిల్లలు సరాదాగా తమ కుటుంబాలతో కలిసి మ్యాచ్ చూడాలని వస్తుంటారు. అమ్ముడుపోని టికెట్స్ ను పిల్లల కోసం 40 పౌండ్లకు ఇచ్చేయండి..’ అని రాసుకొచ్చాడు.