IPL Mega Auction | అతడు క్రికెట్ ఆల్రౌండర్ . పేరు శివమ్దూబే.. ఆదివారం డబుల్ తీపివార్తలు అందుకున్నాడు. బెంగళూరులో ఐపీఎల్ మెగావేలం-2022లో చెన్నై సూపర్ కింగ్స్ మధ్యాహ్నం రూ.4 కోట్లకు ఆయన్ను సొంతం చేసుకుంది. అంతకుముందే తండ్రయ్యాడు. మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ సారధ్యంలో ఐపీఎల్-2022లో ఆడనున్నాడు. సోమవారం వాలంటైన్స్డే.. అంటే ప్రేమికుల రోజు.. శివమ్దూబే ప్రేమ పక్షే. ముంబై వాసి శివమ్ దూబే గతేడాది గర్ల్ఫ్రెండ్ అంజుమ్ఖాన్ను పెండ్లాడాడు. ఆదివారం అంజుం మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో శివమ్ దూబె తన భార్య, కొడుకు ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. శివమ్ దూబే పోస్ట్ను చెన్నై సూపర్ కింగ్స్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
లోకల్ క్రికెట్లో ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న శివమ్ దూబే.. గత సీజన్లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించాడు. గతేడాది రూ.4.40 కోట్లకు రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. ప్రస్తుత వేలంలో ఆయన బేస్ ధర రూ.50 లక్షలు మాత్రమే. ఇంతకుముందు రాయల్ చాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. శివమ్ దూబే రాకతో చెన్నై సూపర్ కింగ్స్కు ఇద్దరు ఆల్రౌండర్లు జత కలిశాడు. దీపక్ చాహర్ను కూడా సీఎస్కే సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.
భారత్ జట్టు తరఫున 13 టీ-20 మ్యాచ్లు, ఒక వన్డే ఇంటర్నేషనల్ ఆడాడు. టీ-20 మ్యాచ్ల్లో 105 పరుగులు చేసిన శివమ్ దూబె యావరేజి స్కోర్ 17.50 పరుగులు. ఐపీఎల్లో 24 మ్యాచ్ల్లో 399 పరుగులు చేశాడు. ఐపీఎల్ స్ట్రైక్ రేట్ 120.5 పరులుగు. ఇందులో 24 ఫోర్లు, 22 సిక్సర్లు కూడా ఉన్నాయి. 24 మ్యాచ్ల్లో నాలుగు వికెట్లు కూడా తీశాడు.
కానీ ఐపీఎల్ టోర్నీ వేలంలో శివమ్ దూబే ధర నిత్యం పడిపోతూ వస్తున్నది. 2019 సీజన్లో రాయల్ చాలెంజర్స్ ఆఫ్ బెంగళూర్ (ఆర్సీబీ) రూ.5 కోట్లకు సొంతం చేసుకుంది. గత సీజన్లో రాజస్థాన్ రాయల్స్ రూ.4.40 కోట్లకు కొనుగోలు చేసింది. తాజా వేలంలో రూ.4 కోట్లకే చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) సొంతమయ్యాడు.