గడిచిన మూడేండ్లుగా అంతర్జాతీయ కెరీర్ లో సెంచరీ లేక ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న విరాట్ కోహ్లిపై భారత దిగ్గజ సారథి కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోహ్లిని ఇలా చూడటం బాధాకరంగా ఉందన్న కపిల్.. అతడి బ్యాట్, ప్రదర్శనలు మాట్లాడాలని సూచించాడు. కోహ్లి మనకు హీరో వంటి వాడని.. అలాంటిది అతడిలా వరుసగా విఫలమవుతుంటే కచ్చితంగా విమర్శించి తీరుతామని స్పష్టం చేశాడు.
కోహ్లి ఫామ్ గురించి కపిల్ స్పందిస్తూ.. ‘సెంచరీ చేయడానికి కోహ్లి వంటి గొప్ప ఆటగాడు ఇన్ని రోజులు టైం తీసుకోవడం చూస్తుంటే నాకు బాధగా ఉంది. అతడు మనకు హీరో వంటివాడు. గతంలో మనం సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి ఆటగాళ్ల ఆటను ఇతరులతో పోల్చలేమని అనుకున్నాం.. కానీ కోహ్లి వచ్చిన తర్వాత ఆ అభిప్రాయం మారింది. అతడు తన బ్యాటింగ్ విన్యాసాలతో దిగ్గజ ఆటగాళ్లతో పోల్చేలా చేసుకున్నాడు. కానీ ఇప్పుడు రెండేండ్లుగా అతడు సెంచరీ కోసం తంటాలు పడటం చూస్తుంటే నాకు బాధగా ఉంది..
నేను కోహ్లి ఆడినంత క్రికెట్ ఆడలేదు. అయినా ఆట గురించి తెలిసినప్పుడు ఆటగాళ్లను విమర్శించే హక్కు మాకుంటుంది. మేము కూడా క్రికెట్ ఆడాం. మేం కూడా ఆట గురించి అర్థం చేసుకున్నాం. ఒకవేళ నువ్వు మమ్మల్ని (విమర్శకుల్ని) తప్పు అని ప్రూవ్ చేయాలనుకుంటే నీ ఆట బాగుండాలి. ఒకవేళ నువ్వు సరిగా ఆడకుంటే ప్రజలు నిన్ను ఏమీ అనకూడదని అనుకుంటే కుదరదు. నీ ఆట, ప్రదర్శన మాట్లాడాలి. నువ్వు కాదు. అంతే.. అంతకుమించి ఏమీలేదు..’ అని వ్యాఖ్యానించాడు.
2019 ఆగస్టులో సెంచరీ చేసిన తర్వాత కోహ్లి మళ్లీ ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు వేయలేదు. మార్చిలో స్వదేశంలో లంకతో జరిగిన తొలి టెస్టు (కోహ్లికి వందో టెస్టు) లో అయినా అతడు సెంచరీ చేస్తాడని అంతా ఆశించారు. కానీ ఆ మ్యాచ్ లో కోహ్లి హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. ఇక ఇటీవలే ముగిసిన ఐపీఎల్ లో కూడా అదే వైఫల్యాలను కొనసాగించాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న కోహ్లి.. ఇకనైనా 71వ సెంచరీ చేస్తాడేమో చూడాలి.