మలేషియా ఓపెన్ అంతర్జాతీయ స్థాయిలో నిలకడైన ప్రదర్శన కొనసాగిస్తున్న సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ.. తాజా సీజన్లో కూడా అదే దూకుడు కొనసాగిస్తున్నది. ఈ ఏడాది బరిలోకి దిగిన తొలి టోర్నీ మలేషియా ఓపెన్లో సాత్విక్ జంట సెమీఫైనల్కు దూసుకెళ్లింది. ఇటీవల దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్చంద్ ఖేల్త్న్ర అవార్డు గెలుచుకున్న ఈ ద్వయం.. ఒక్క గేమ్ కోల్పోకుండా.. సెమీస్లో అడుగుపెట్టింది.
కౌలాలాంపూర్: పారిస్ ఒలింపిక్స్ సమీపిస్తున్న తరుణంలో స్టార్ బ్యాడ్మింటన్ జోడీ సత్తాచాటింది. ఇతర భారత షట్లర్లంతా చేతులెత్తేసిన చోట సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి అదరగొట్టారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ -1000 టోర్నీ పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో శుక్రవారం సాత్విక్-చిరాగ్ ద్వయం 21-11, 21-8తో రెన్ జియాంగ్-హె జీ టింగ్ (చైనా) జంటపై విజయం సాధించింది. ప్రపంచ రెండో ర్యాంక్లో ఉన్న భారత షట్లర్లకు 32వ ప్లేస్లో ఉన్న చైనా ప్లేయర్లు కనీస పోటీనివ్వలేకపోయారు. అరగంటలోనే ముగిసిన పోరులో భారత ఆటగాళ్లు వరుస గేమ్ల్లో విజృంభించారు. నిరుడు ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించిన ఈ ద్వయం.. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయింది. శనివారం జరగనున్న సెమీఫైనల్లో కాంగ్ మిన్ హ్యూక్-సియో సెవాంగ్ (కొరియా) జంటతో సాత్విక్-చిరాగ్ తలపడనున్నారు. నిరుడు ఆరు టైటిల్స్తో అదరగొట్టిన సాత్విక్ జోడీ.. ఒలింపిక్స్ పతకం పట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. పూర్తి ఏకపక్షంగా సాగిన పోరులో మనవాళ్లు లాంగ్ ర్యాలీలతో పాటు మెరుపు షాట్లు, నెట్గేమ్తో విజృంభించారు.
అశ్విని జంటకు నిరాశ
మరోవైపు మహిళల డబుల్స్ క్వార్టర్స్లో అడుగుపెట్టి ఆశలు రేపిన అశ్విని పొన్నప్ప-తనీషా జంట పోరాటం ముగిసింది. శుక్రవారం క్వార్టర్ ఫైనల్లో అశ్విని-తనీషా జోడీ 15-21, 13-21తో రిన్ ఇవాంగా-కై నకాన్షి (జపాన్) ద్వయం చేతిలో పరాజయం పాలైంది. గత మ్యాచ్లో మాజీ ప్రపంచ చాంపియన్లను మట్టికరిపించిన మన అమ్మాయిలు.. అదే దూకుడు కొనసాగించలేక ఇంటిబాట పట్టారు.